శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2022 (18:02 IST)

వాకలపూడి సెజ్‌లో పేలుడు - ఇద్దరు మృతి

Parry Sugars Factory
కాకినాడ గ్రామీణ పరిధిలోని వాకలపూడి పారిశ్రామికవాడ ప్రాంతంలోని ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ రిఫైనరీలో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు కార్మికులు మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడు విద్యుదాఘాతం కారణంగా సంభవించినట్టు తెలుస్తోంది. గోదాంలో చక్కెర బస్తాలు లోడు చేస్తుండగా, కన్వేయర్ బెల్టుకు విద్యుత్ కలెక్షన్ ఇచ్చే సందర్భంగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. 
 
ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతులను ఉప్పాడ కొత్తపల్లి మండలం కొండివరం గ్రామానికి చెందిన రాయుడు వీర వెంకట సత్యనారాయణ (36), సామర్లకోట మండలం వేటలపాలెం గ్రామానికి చెందిన వీరమల్ల రాజేశ్వర రావు (45)గా గుర్తించారు. 
 
గాయపడిన వారిని పిఠాపురం చంద్రాడ గ్రామానికి చెందిన బండి వీర వెంకట రమణ (28) పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయన్ను కాకినాడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మిగిలిన 8 మందిని కాకినాడ నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.