శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

స్వచ్ఛంధ బెయిల్ అవకాశాన్ని కోల్పోయిన ఎమ్మెల్సీ అనంతబాబు

anantha babu
తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టు అయి జైల్లో ఉంటున్న ఏపీలోని అధికార వైకాపాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు స్వచ్ఛంధ బెయిల్ పొందే అవకాశాన్ని తృటిలో కోల్పోయారు. ఆయన అరెస్టు చేసిన తర్వాత 90 రోజులలోపు ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేయాల్సివుంటుంది. అలా చేయనిపక్షంలో నిందితుడు స్వచ్ఛంధంగా బెయిల్ పొందే అవకాశం ఉంటుంది. అయితే, కాకినాడు పోలీసులు ఈ కేసులు చార్జిషీటు దాఖలు చేయడానికి ఉన్న 90 రోజుల గడవు ముగియకముందే అంటే 88వ రోజున చార్జిషీటు దాఖలు చేశారు. దీంతో ఎమ్మెల్సీ అనంతబాబు స్వచ్చంద బెయిల్‌ను పొందే అవకాశాన్ని కోల్పోయాడు. 
 
కాగా, గత నెల మే 19వ తేదీన అంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అదే నెల 23వ తేదీన పోలీసులు అనంతబాబును అరెస్టు చేశారు. అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన ఉంటున్నారు. ఈ క్రమంలో పలుమార్లు ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 
 
మరోవైపు, నెలలు గడుస్తున్నా పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేయకుండా నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఏదైనా కేసులో ఏవరైనా అరెస్ట్ అయితే 90 రోజుల్లోపు చార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే నిందితుడు స్వచ్ఛందంగా బెయిలు పొందేందుకు అర్హత లభిస్తుంది. 
 
ఈ నేపథ్యంలో సరిగ్గా 88వ రోజునాడు అంటే స్వచ్ఛంద బెయిలు అర్హత లభించడానికి రెండు రోజల ముందు పోలీసులు నిన్న ప్రిలిమినరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ మేరకు కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. కేసుకు మరింత బలం చేకూరేలా మరిన్ని ఆధారాలతో అదనపు చార్జ్‌షీట్ కూడా దాఖలు చేస్తామని చెప్పారు.