1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2023 (10:55 IST)

ఆమె ఫోటోను డీపీగా పెట్టుకున్నా... మరేం తప్పు చేయలేదు : లేఖరాసి రైల్వే ఉద్యోగి సూసైడ్

కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో ఓ విషాదం జరిగింది. ఒక మహిళ ఫోటోను డీపీగా పెట్టుకున్న రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో సస్పెండ్‌కు గురైన ఆ ఉద్యోగి తీవ్ర మనోవేదనతో పురుగుల మందు సేవించి ప్రాణాలు తీసుకున్నాడు. అంతకుముందు తన ఆత్మహత్యకు కారణం చెబుతూ ఓ వీడియోను రికార్డింగ్ చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన పులి శంకరయ్య రైల్వే ఉద్యోగి. పదేళ్ల క్రితం ఆయనకు పక్షవాతం రావడంతో అన్‌ఫిట్‌గా ప్రకటించి  ఆయన కుమారుడు రవికుమార్‌కు రైల్వే ఉద్యోగం ఇచ్చారు. కుటుంబ సమస్యల కారణంగా వివాహం చేసుకోని ఆయన కొన్నేళ్లుగా కాజీపేట ఎలక్ట్రికల్ లోకోషెడ్‌లో టెక్నీషియన్-3గా పనిచేస్తూ ఈఎన్ఎస్ క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. 
 
ఈ క్రమంలో తన సహోద్యోగి అయిన కె.దివ్యారెడ్డికి అవసరం నిమిత్తం దశలవారీగా రూ.2.80 లక్షలు ఇచ్చాడు. షెడ్ ఉద్యోగులందరూ దివ్యారెడ్డితో కలిసి దిగిన గ్రూప్ ఫొటోను రవికుమార్ తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఇది చూసిన దివ్యారెడ్డి అదే కార్యాలయంలో స్టెనో విఠల్ రావుకు ఫిర్యాదు చేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు రవికుమార్‌ను కొన్ని నెలల క్రితం సస్పెండ్ చేసి కాజీపేట ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యాలయానికి బదిలీ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రవికుమార్ అక్కడ జాయిన్ కాలేదు. ఆదివారం రాత్రి క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
అంతకుముందు.. అందరికీ నమస్కారమంటూ ఓ సూసైడ్ నోట్ రాసి, వీడియోను తన తమ్ముడు తిరుపతికి షేర్ చేశాడు. తన చావుకు దివ్యారెడ్డి, విఠల్ రావే కారణమని అందులో పేర్కొన్నాడు. పదేళ్లుగా ఒక్క సెలవు కూడా పెట్టలేదని, తన వాట్సాప్‌లో దివ్యారెడ్డి ఫొటోను డీపీగా పెట్టుకోవడం తప్ప తాను ఏ తప్పూ చేయలేదని పేర్కొన్నాడు. ఈ ఒక్క కారణంతో తనను వేధించారని, తన నుంచి డబ్బులు లాక్కున్నారని, ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారని, దీంతో మానసిక వేదనకుగురై ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో పేర్కొన్నాడు. రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.