గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (19:47 IST)

రసవత్తరంగా నెల్లూరు పాలిటిక్స్ - అనిల్ బహిరంగ సభ - కాకాణి సైకిల్ యాత్ర

anil - kakani
నెల్లూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటును కోల్పోయిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆదివారం గాంధీ బొమ్మ సెంటరులో బహిరంగ నిర్వహిస్తున్నారు. మరోవైపు, సీఎం జగన్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి సైకిల్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. 
 
ఈ ర్యాలీ కావలి నుంచి నెల్లూరు వరకు సానుంది. వైకాపాకు చెందిన ఒక మాజీ మంత్రి, ప్రస్తుత మంత్రి పోటాపోటీ రాజకీయాలకు తెరలేపడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ బహిరంగ సభ, సైకిల్ ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా వెయ్యి మంది పోలీసులతో భద్రతను కల్పించారు. 
 
కాగా, మంత్రిపదవి చేపట్టిన తర్వాత కాకాణి గోవర్థన్ తొలిసారి జిల్లా కేంద్రానికి వస్తున్నారు. ఈయన ఇప్పటికే కావలికి చేరుకున్నారు. కావలి నుంచి నెల్లూరులోని పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీ కోవూరు, పడుగుపాడు, ఆత్మకూరు బస్టాండు మీదుగా సాగుతుంది. 
 
మరోవైపు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో బహిరంగ సభ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం సాయంత్రం గాంధీ బొమ్మ సెంటరులో ఈ సభ జరుగనుంది. ఇరువురు నేతల కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ వెయ్యి మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటుచేశారు.