బుధవారం, 18 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 ఆగస్టు 2024 (11:40 IST)

కృష్ణా జిల్లా.. వరద ప్రవాహంలో కొట్టుకునిపోయిన వ్యక్తి (Video)

flood water
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ముప్పల గ్రామంలో భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి పొర్లుతుండగా రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలోని భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతుంది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. 
 
భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అన్నిశాఖలు సహకరిస్తూ ముందుకు సాగాలని కోరారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి ఆదేశించారు. భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజలకు మొబైల్ ఫోన్ల ద్వారా ఎప్పటికపుడు అలెర్ట్ మెసేజ్‌లు పంపించాలని కోరారు. వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టాలని, ప్రజల ప్రమాదాల బారిన పడుకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 
 
ఇదిలావుంటే, అరేబియా సముద్రంలో కూడా ఏర్పడిన వాయుగుండం తుఫాను‌గా మారిందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో గుజరాత్‌లో కుండపోత వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఈ తుఫానుకు పాకిస్థాన్ సూచించిన అస్నా అని పేరు పెట్టారు. 1976 తర్వాత అరేబియా సముద్రంలో ఆగస్టు నెలలో ఏర్పడిన తొలి తుఫానుగా దీన్ని పేర్కొంటున్నారు. కచ్ తీరం మీదుగా శుక్రవారం విస్తరించిన అస్నా తుఫాను అరేబియా సముద్రంలోకి ఒమన్ దిశగా కదిలింది. మరో వైపు కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏర్నాకులం, కొట్టాయం జిల్లాల్లో గంటకు 50 కిలో మీటర్లవేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.