శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (20:38 IST)

బాబు ఆడియో, వీడియో ఏం చెబుతున్నాయి..?: మంత్రి బొత్స సత్యనారాయణ

ఓటుకు కోట్లు కేసులో.. మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ, నోట్ల కట్టలతో రేవంత్ రెడ్డిని పంపించి, టీవీల సాక్షిగా కళ్ళకు కట్టినట్టు ఆడియో, వీడియోల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు చేసిన నేరం, దర్యాప్తు సంస్థల కళ్ళకు కనిపించకపోవడం విడ్డూరంగానూ, ఆశ్చర్యంగానూ ఉందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

ఆ వీడియోలను, ఆడియోలను చూస్తే.. చంద్రబాబును శిక్షించాలో, వద్దో ప్రజా న్యాయస్థానంలో అడిగితే ప్రజలే సమాధానం చెబుతారని బొత్స అన్నారు. వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేయవచ్చునేమోగానీ, ప్రజాస్వామ్యంలో ప్రజలను మేనేజ్ చేయలేడని స్పష్టం చేశారు. 
 
మంత్రి  బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ఇంకా ఏమన్నారంటే..
 
1. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఒరవడిని తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్ తీసుకొస్తే.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఆ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 99 శాతం హామీలను నెరవేర్చింది. ఆడంబరాలు, అట్టహాసాలు, వ్యక్తిగత పోకడలకు తావు లేకుండా, ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.

ప్రజల ముందున్న సమస్యలకు సంబంధించి శాశ్వతమైన పరిష్కారాల కోసం, దీర్ఘకాలికమైన ప్రజా ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది.  అయితే ప్రధాన ప్రతిపక్షం గత రెండేళ్ళుగా ప్రభుత్వంపై బురదజల్లడం, సీఎం జగన్ గారిపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంది. 
 
2. అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ జూమ్ కాన్ఫరెన్స్ లో మహానాడును జరుపుకుంటూ.. ఆత్మస్తుతి-పరనింద తరహాలో చంద్రబాబు నాయుడ్ని ఆకాశానికెత్తడం, ప్రభుత్వంపైనా, జగన్ మోహన్ రెడ్డిగారిపైన విమర్శలు చేయడానికే సమయం అంతా వెచ్చించారు. మహానాడులో చంద్రబాబును ఆ పార్టీ నాయకులు పొగడ్తలతో ముంచెత్తినా... ఆఖరికి ఆ పార్టీ అనుకూల పత్రికల్లో కూడా చంద్రబాబు సొంత డబ్బాను ఎక్కడో మూలన వేశారు. మహానాడులో చంద్రబాబు భజన మానేసి.. రామ భజన చేసుకున్నా లేక రామ కోటి రాసుకున్నా వారికి ఏ కొంచెం అయినా పుణ్యం వచ్చేది. 
 
3. ఓటుకు కోట్లు కేసు నేపథ్యంలో.. చంద్రబాబు తరఫున ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వెళ్ళిన రేవంత్ రెడ్డి ఇచ్చిన నోట్ల కట్టలు ఒకవైపు.. నేరుగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను ప్రపంచం అంతా టీవీల్లో చూశారు. అయితే, చంద్రబాబు బహిరంగంగా నేరం చేసినా.. దర్యాప్తు సంస్థలకు ఆయన కనిపించకపోవడం, విచారణకు పిలవకపోవడం విడ్డూరం, ఆశ్చర్యకరం.

మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ.. అన్న చంద్రబాబు వాయిస్ దేశం అంతా వినింది. ఐ యామ్ విత్ యూ.. నీతో నేను ఉన్నాను అని ఎమ్మెల్యేను ప్రలోభ పెడుతూ చంద్రబాబు మాట్లాడితే.. అది చంద్రబాబు స్వరమే అని ఫోరెన్సిక్ ల్యాబ్ లో కూడా నిర్థారిస్తే.. ఈడీకి ఎందుకు కనిపించడం లేదో అర్థం కావడం లేదు. 

- ఈ పరిస్థితుల వల్ల ఐపీసీ, సీఆర్ పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ల మీద ఇక ఎవరికైనా నమ్మకం ఉంటుందా..?
- ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి తెలంగాణ ఏసీబీకి ఎలా పట్టుబడ్డాడో... నామినేటెడ్ ఎమ్మెల్యేతో చంద్రబాబు ఫోన్ లో ఏం మాట్లాడాడో.. దీనికి సంబంధించిన వీడియోలను మీడియా సమక్షంలో ప్రదర్శించారు. 
- ఈ వీడియోలను చూసిన తర్వాత ప్రజా న్యాయస్థానంలో ఏ ఒక్కరిని అడిగినా చంద్రబాబుకు శిక్ష పడాలో.. వద్దో చెబుతారు.  మరి దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నట్టు..?

- కళ్ళకు కట్టినట్టు డబ్బు కట్టలు టేబుల్ మీద పెట్టి ఎమ్మెల్యేలను కొంటూ.. ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ.. అని మాట్లాడితే దర్యాప్తు సంస్థలకు కనిపించలేదంటే, వ్యవస్థలు ఏమైపోతున్నాయో అర్థం కావడం లేదు. 
 
4. పెద్ద వాళ్ళు దోచుకుంటే చిల్లర.. చిన్నవాడు తింటే పెద్దది అన్న సామెతలా.. చంద్రబాబు చేస్తే తప్పు కాకుండా పోతుందా..? అదే పని చిన్నవాళ్ళు చేస్తే మాత్రం తప్పు అవుతుందా..?
- కోర్టుల నుంచి స్టేలు తెచ్చినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోతాయా..? చంద్రబాబు నిర్దోషి అని ఈ రోజు రాయటానికి ఓ వర్గం మీడియాకు బుద్ధి అయినా ఉండాలి. 
- ఓటుకు కోట్లు కేసు నేపథ్యంలో.. ఆరోజు చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై రాజద్రోహం కేసు పెట్టి.. బీరాలు పలికి, ఆ తర్వాత తప్పు బయటపడేసరికి, ఎక్కడ వెళ్ళగొడతారో అన్న భయంతో అక్కడ నుంచి అర్థరాత్రి పారిపోయి వచ్చిన పరిస్థితి.
- వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చేమోగానీ.. ప్రజాస్వామ్యంలో ప్రజలను మేనేజ్ చేయలేరు. అందుకే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఈ రాష్ట్రం నుంచే వెళ్ళగొట్టారు. 
 

5. ఇలాంటి చరిత్ర కలిగిన చంద్రబాబు వేరే రాష్ట్రంలో ఉండి జూమ్ కాన్ఫరెన్స్ లో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ.. ఆయనపై పొగడ్తలు పొగిడించుకోవడం, భజన చేయించుకోవడమే నాయకత్వమా..? 
-మహానాడులో ఆ పార్టీ తీర్మానాలు చూస్తే నవ్వు వస్తుంది. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఈరోజు కూడా తీర్మానించారు. 
- 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఈయనే దేశంలో, కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పానని చెప్పుకున్నాడు కదా.. ఎందుకు ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించలేకపోయారు...?  చంద్రబాబు వ్యవహారం చూస్తే ప్రజలు నవ్విపోతారు అన్న సిగ్గు ఎక్కడలేదు..? 
 
6. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలో ఏనాడైనా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించిన పరిస్థితి లేదు. కులాలు, మతాలు, దేవుడి మీద అభూతకల్పనలు సృష్టించి, సమాజంలో అలజడి రేపి, రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఎన్నో కుట్రలు చేశారు. చివరికి ఆ కుట్రల్లో పాత్రధారులు, సూత్రధారులు ఎవరో కూడా విచారణల్లో బట్టబయలు అయ్యాయి. 
 
7. దేశం, ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోతుంటే.. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేందుకు అంతా కలిసికట్టుగా ప్రయత్నాలు చేస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం ఏం చేస్తుంది. ఆఖరికి కరోనా పరిస్థితుల పైన కూడా నిందలు వేస్తుంది.  అదే చంద్రబాబు హయాంలో ఇటువంటి పరిస్థితే వస్తే.. ఆయన హడావుడి, హావభావాలు, డ్రామాలు ఎన్ని చూడాల్సి వచ్చేదో.. అని ప్రజలు భావిస్తున్నారు. 

- ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కమిట్ మెంటుతో నిత్యం కోవిడ్ పై సమీక్షిస్తూ.. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 
- కోవిడ్ ను ఆరోగ్య శ్రీలో చేర్చి ఉచితంగా వైద్యం అందించడంతోపాటు, టెస్టుల్లోగానీ, మందులు సరఫరాలోగానీ.. వ్యాక్సినేషన్ లో గానీ పూర్తి బాధ్యతతో, చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. 
 
8. పార్టీ లేదు, బొక్కా లేదు అని  తిరుపతి ఉప ఎన్నికల సమయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏ విధంగా మాట్లాడాడో అందరూ చూశారు. ఆ పార్టీ నాయకత్వం మీద ఏమాత్రం నమ్మకం ఉందో అచ్చెన్నాయుడు మాటల్లోనే తెలిసిపోతుంది. ఈరోజు మళ్ళీ ఆయనే చంద్రబాబు మెప్పు కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇలా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయకుల మాటలకు విలువ ఎక్కడ ఉంటుంది..?
 
9. రాష్ట్రంలో ఆసరా కావాలని ఏవర్గాలైతే కోరుకుంటున్నాయో.. వారందరికీ జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వం అండగా ఉంటూ.. దాదాపు రూ. 1.25 లక్షల కోట్లను ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా డీబీటీ ద్వారా నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో ఈ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు వేసింది. 
 
10. ఇక ఈరోజు మహానాడులో ప్రాజెక్టుల గురించి చంద్రబాబు, టీడీపీ నేతలు అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రూ. 27 వేల కోట్లు కావాలని ముఖ్యమంత్రిగా ఒక వైట్ పేపర్ విడుదల చేశారు.

ఆ ప్రాజెక్టులకుగాను గత 5 ఏళ్ళలో ఏకంగా రూ. 69 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారు. దొడ్డిదారిన కిక్ బ్యాక్స్ తీసుకుని ప్రాజెక్టులను అటకెక్కించారు. తెలుగుదేశం పార్టీ చేసిన తప్పుడు విధానాల వల్ల, చంద్రబాబు స్వార్థం వల్ల ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీలకు ఆశపడటం వల్ల, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజుకి కూడా కేంద్రం నుంచి రావాల్సిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇంకా రాలేదు. 

- టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2018లో పోలవరం పూర్తి చేస్తాం.. 2019లో పూర్తి చేస్తాం.. అని బల్లలు కొట్టి, తొడలు కొట్టి జగన్ మోహన్ రెడ్డిగారిని ఏకవచనంతో మాట్లాడి, సవాళ్ళు విసిరిన నాయకులు ఇప్పుడు ఏమయ్యారు..? 
- 5 ఏళ్ళ కాలంలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా..?
- ఎంతసేపటికీ దాచుకుందామా.. దోచుకుందామా అన్నదే చంద్రబాబు ధ్యాస.
 
11. చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల మీడియా మేం చెప్పిందే రాజ్యాంగం అనే పరిస్థితి ఉంది. బాబా సాహెబ్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అనుగుణంగానే సామాన్యులకు మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోంది.  ప్రతి సామాన్యుడు తలెత్తుకుని బతికే విధంగా ఈ ప్రభుత్వం చట్టాలు, నిర్ణయాలు చేస్తుంది. అదే టీడీపీకి కడుపు మంటగా మారింది. 
 
12. మూల్యం చెల్లిస్తాం... అని చంద్రబాబు పదే పదే అంటున్నాడు. తప్పు చేసిన వాళ్ళ మీద చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంటే.. చంద్రబాబు ప్రభుత్వంపైన, అధికారులపైన బెదిరింపులకు పాల్పడుతున్నాడు. చంద్రబాబు బెదిరిస్తే ఇక్కడ ఎవరూ భయపడిపోరు. జగన్ మోహన్ రెడ్డిగారు చంద్రబాబు మాదిరిగా మోసం చేసి అధికారంలోకి వచ్చిన వ్యక్తి కాదు. సుదీర్ఘమైన పాదయాత్ర చేసి, ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. 

- కరోనా కష్టకాలంలోనూ సంక్షేమం, అభివృద్ధే ఏకైక అజెండాగా రెండేళ్ళ గొప్ప పాలనను చూశారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలు అమలు చేస్తుంది. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో టీమ్ వర్క్ తో అంకిత భావంతో ఈ ప్రభుత్వం ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తుంది.