గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (09:19 IST)

ఏయ్.. ఎస్పీ.. తమాషాలొద్దు.. నిన్ను ఎవడూ కాపాడరు : వైకాపా ఎమ్మెల్యే వార్నింగ్

ప్రభుత్వ అధికారులకు అధికార వైకాపా నేతల బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా, గల్లీ స్థాయి నుంచి జిల్లా కలెక్టరు వరకూ ఇదే తరహా బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. చివరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అధికారులను బెదిరిస్తున్నారు. దీంతో అధికార యంత్రాగం భయంతో వణికిపోతోంది. తాజాగా ఏకంగా జిల్లా ఎస్పీకి వైకాపా ఎమ్మెల్యే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఏయ్.. ఎస్పీ తమాషాలు చేస్తున్నావా అంటూ హెచ్చరించారు. ఇలా హెచ్చరించిన ఎమ్మెల్యే పేరు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా కోవూరు శాసనసభ్యుడు. 
 
నెల్లూరు జిల్లా కొడవలూరులో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రసన్న.. ఎస్పీని హెచ్చరించారు. పైగా, ఈ వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకుపోతానని కూడా బెదిరించారు. "వైసీపీ నాయకులపై అసభ్య పోస్టింగ్‌ పెడితే.. తెలుగుదేశం పార్టీ వాళ్లు చెప్పారని జిల్లా పోలీసు అధికారి ఎవరో  కేసు రిజిస్టర్‌ చేయవద్దని చెప్పేది ఏంది? నాకు అర్థం కాలే. ఏమనుకొంటున్నాడాయన... ఎవరనుకొంటున్నాడు.... ఎవరి గవర్నమెంట్‌ అనుకొంటున్నాడు. బాగుండదు.. పద్ధతి కాదు... తమాషాలు పడొద్దు" అంటూ నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌పై ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు.
 
"‘నెల ఉంటావో, రెండు నెలలు ఉంటావో.. ఉన్నన్ని రోజులైనా శుద్ధంగా ఉండు" అంటూ అందరి ముందూ హెచ్చరించారు. కొద్దిరోజులక్రితం టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేశ్‌లపై కోవూరు నియోజకవర్గం కొడవలూరుకు చెందిన వైసీపీ నాయకుడు అసభ్యకరంగా పోస్టింగులు పెట్టారు. దీన్ని సహించలేక ఒక టీడీపీ నాయకుడు పోస్టింగ్‌ పెట్టిన వైసీపీ వ్యక్తిపై అసభ్యకర పదజాలంతో తిరిగి పోస్టింగ్‌ చేశారు. 
 
దీనిపై వైసీపీ నాయకులు కొడవలూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు 292 కింద కేసు నమోదు చేశారు. అయితే పోస్టింగ్‌ పెట్టిన టీడీపీ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైసీపీ నాయకులు పట్టుబట్టారు. దీనికి ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ అంగీకరించలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఏర్పాటుచేసిన సభలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి.. ఎస్పీపై విరుచుకుపడ్డారు.
 
"ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయండి. డీఎస్పీ వచ్చి విచారిస్తారు. తప్పుడు కేసు అయితే తీసేస్తారు. నిజమని తేలితే లోపలేస్తారు. అంతేకదా!? కేసు రిజిస్టర్‌ చేయవద్దనడానికి నువ్వెవరు!? బాగుండదు. ఉన్నన్ని రోజులైనా శుద్ధంగా ఉండు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు! ఎవరు నేర్పించారు నీకు రూల్స్‌! ఎవరు కాపాడుతారు నిన్ను! విజయవాడలో డీజీపీ నిన్ను కాపాడుతారనుకొంటున్నావా? బాగుండదు. నువ్వు తెలుగుదేశం ఏజెంటువా.. మా జిల్లా పోలీసు అధికారివా? 
 
ఎవడో టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఫోన్‌ చేసి చెబితే కేసు రిజిస్టర్‌ చేయవద్దనడానికి నువ్వు ఎవరు? ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. పైగా కేసు కడితే జైల్లో వేయిస్తానని కింది సిబ్బందిని బెదిరిస్తావా? నీకుందా ఆ దమ్ము! మా ఎస్‌ఐ, సీఐల పక్కన నేను నిలబడతాను. రా! దమ్ముంటే అరెస్ట్‌ చేయించు... ఏమనుకొంటున్నావు. ఎవరి గవర్నమెంట్‌ అనుకొంటున్నావు.. నాతో పెట్టుకోవద్దు" అంటూ గద్దించారు. దళిత ఎమ్మెల్యేల మీద అసభ్యంగా పోస్టింగులు పెడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.