1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 జనవరి 2021 (09:11 IST)

పాకిస్థాన్ ఉప ఎన్నికలు.. బిలావల్ భుట్టో పార్టీ గెలుపు

పాకిస్థాన్ ఉప ఎన్నికల్లో బెనజీర్ భుట్టో పార్టీ మళ్లీ జీవం పోసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో బిలావాల్ భుట్టో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ విజయం సాధించింది. ప్రాథమిక ఫలితాల ప్రకారం ఉమెర్‌కోట్ ఉప ఎన్నికల్లో బిలావాల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్సు పార్టీ (పీపీపీ) విజయం సాధించింది. 
 
ఉమెర్ కోట్ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు తర్వాత గ్రాండ్ డెమోక్రటిక్ అలయెన్సు నాయకుడు అర్బాబ్ గులాం రహీంకు 30,921 ఓట్లు వచ్చాయి. పీపీపీ అభ్యర్థి అమీర్ అలీ షాకు 55,904 ఓట్లు సాధించినట్లు పాక్ మీడియా వెల్లడించింది. 
 
ఎన్నికల్లో విజయం తర్వాత విజేతను పీపీపీ నాయకుడు బిలావాల్ భుట్టో అభినందించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని తొలగించడానికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ఏకైక మార్గమని బిలావాల్ గత వారం చెప్పారు.
 
ఇదిలా ఉంటే.. గడువులోగా ఆస్తులను వెల్లడించని ప్రజాప్రతినిధులపై పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. 154 మంది చట్టసభల సభ్యత్వాలను తాత్కాలికంగా రద్దు చేసింది. వీరిలో జాతీయ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికైన వారితో పాటు సెనేట్‌ సభ్యులూ ఉన్నారు. 
 
పాకిస్థాన్‌ ఎన్నికల చట్టం-2017 నిబంధన 137(1) ప్రకారం ప్రతియేటా డిసెంబరు 31వ తేదీ లోపు ప్రతి చట్టసభ సభ్యుడూ తనతో పాటు కుటుంబ సభ్యుల అందరి ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించడం తప్పని సరి. 
 
దీనిని ఉల్లంఘించిన వారిపై వేటు వేసింది. ఆ వివరాలు ఇచ్చిన తర్వాతే సభ్యత్వాల రద్దును ఉపసంహరిస్తుంది. గత ఏడాది కూడా 300 మంది ప్రజాప్రతినిధులపై ఈసీ చర్యలు తీసుకొని ఆ తర్వాత ఉపసంహరించుకుంది.