1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (18:14 IST)

సీఎం జగన్‌ కు నారా లోకేష్ లేఖ.. ట్రూ అప్ ఛార్జీలను..?

విద్యుత్ సంక్షోభం, విద్యుత్ ఛార్జీలపై సీఎం జగన్‌ కు నారా లోకేష్ లేఖ రాశారు. విద్యుత్ వినియోగదారులకు భారంగా మారిన పెంచిన చార్జీలను తగ్గించాలని… ట్రూఅప్ చార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని లేఖలో నారా లోకేష్‌ పేర్కొన్నారు.

కుప్పకూలిన విద్యుత్‌ రంగాన్ని అత్యవసరంగా గాడిన పెట్టాలని.. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కరెంట్ చార్జీలు పూర్తిగా తగ్గించేస్తామని ప్రతీ సభలో చెప్పిన విషయాలు ఇప్పటికీ జనం చెవిలో మార్మోగుతున్నాయని మండిపడ్డారు.
 
ఐదేళ్ల టిడిపి పాలనలో ఒక్కసారి కూడా చార్జీలు పెంచకపోయినా నాడు అసత్య ప్రచారాలు చేశారని.. రెండున్నరేళ్ల పాలనలో ఇప్పటికే 6 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని ఫైర్‌ అయ్యారు. మరోసారి ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని… సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఏసీలు ఆపేయాలంటూ అధికారులతో సుద్దులు చెప్పిస్తున్నారని చురకలు అంటించారు.
 
దేశ వ్యాప్తంగా విద్యుత్ యూనిట్‌ ధర రూ.3.12 లకే లభిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ గరిష్టంగా రూ. 20కు ఎందుకు కొనుగోలు చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. యూనిట్‌కి అదనంగా పెడుతున్న రూ. 16 సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళుతోంది? రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు చెల్లించాల్సిన రూ. 12 వేల కోట్లు, ప్రభుత్వ రంగ సంస్థలకివ్వాల్సిన రూ. 10,800 కోట్లు చెల్లిస్తే విద్యుత్ రంగం కుప్పకూలే దుస్థితి వచ్చేది కాదన్నారు. వెంటనే ప్రభుత్వం బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుని సంక్షోభంలో పడిన విద్యుత్‌ రంగాన్ని కాపాడాలని నారా లోకేష్‌ డిమాండ్‌ చేశారు.