1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 9 అక్టోబరు 2021 (13:39 IST)

పిచ్చి తుగ్లక్ అని చిన్నప్పుడు చదువుకున్నా... ఇప్పుడు పిచ్చి జగన్ ను చూస్తున్నా!

రెండున్నరేళ్ల పాలనలో ఇంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పిచ్చి తుగ్లక్ అని చిన్నప్పుడు చదువుకున్నానని, ఇప్పుడు పిచ్చి జగన్ ను చూస్తున్నాని ఎద్దేవా చేశారు. తుగ్లక్ జుట్టు మీద పన్ను వేస్తే జగన్ చెత్త మీద పన్ను వేస్తున్నాడని దుయ్యబట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం కనిగిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు బొల్లా మాల్యాద్రి, పెద్ద ఎత్తున వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పార్టీ ఇంచార్జి ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ చంద్రబాబు టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ,  రాష్ట్రంలో ఉన్నవన్నీ జగన్ రెడ్డి బ్రాండ్లేనని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను లిక్కర్ బ్రాండ్లకు పేర్లు పెట్టారని విమర్శించారు. 
 
‘‘40 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలామంది ముఖ్యమంత్రులను చూశాను. సమైక్యాంధ్రలో అందరికంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేశాను. తెలుగు జాతి గుండెల్లో నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ దగ్గర పనిచేయడమే కాకుండా శిక్షణ కూడా తీసుకున్నాను. జగన్ పాలనలో అవినీతి, విధ్వంసం తప్ప మరొకటి లేదు. పిచ్చి నిర్ణయాలతో దొంగ పాలన చేస్తున్నారు. ప్రజలు ప్రభుత్వంపై తిరగబడకుంటే చివరకు ఏమీ మిగలదు. నా ఆవేదన పదవి కోసం కాదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశాను. ఈ రాష్ట్రం ఏమౌతుందో, యువత భవిష్యత్ ఏమవుతుందనే నా బాధ. డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్ నుండి నేరుగా రాష్ట్రానికి వస్తున్నాయి. తాలిబన్ల నుండి తాడేపల్లికి నేరుగా వస్తున్నాయి. ఎన్ఐఏ విచారణ చేస్తుంటేనే ఓ పత్రిక ఏపీకి సంబంధం లేదని సర్టిఫికేట్ ఇస్తోంది. ఎవరికోసం హెరాయిన్ తెచ్చారు..ఎవరు తెచ్చారు.? సుధాకర్ అనే వ్యక్తి చెన్నైలో వుంటే నేరుగా ఆఫ్ఘనిస్తాన్ కు అడ్రస్ పెట్టారంట. మామూలు వ్యక్తులకు ఆఫ్ఘనిస్తాన్ తెలుసా.? లిక్కర్ విషయంలో చరిత్రలో ఎవరైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.