1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (09:42 IST)

అయ్యయ్యా.. ఒక్కసారి వచ్చిపోండి.. ఆశిష్ మిశ్రాకు యూపీ పోలీసుల అభ్యర్థన

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరి హింస కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడైన కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా పట్ల యూపీ పోలీసులు పూర్తి స్థాయిలో పక్షపాతం చూపుతున్నారు. హేయమైన చర్యకు పాల్పడిన పలువురి మృతికి కారణమైన అశిష్ మిశ్రాను అరెస్టు చేసే విషయంపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. కనీసం ఆయన వద్ద విచారించేందుకు సైతం యూపీ పోలీసులు సాహసం చేయలేకపోతున్నారు. పైగా, విచారణకు రావాల్సిందిగా ఆశిష్ మిశ్రా వద్ద యూపీ పోలీసులు మోకరిల్లుతున్నారు. మరోవైపు, ఆశిష్ మిశ్రా నేపాల్ పారిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
నిజానికి ఈయన శుక్రవారం పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ విచారణకు డుమ్మా కొట్టారు. విచారణకు ఆశిష్ హాజరు కాకపోవడంపై ఆయన తండ్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ.. అనారోగ్యంగా ఉండటం వల్లే హాజరు కాలేకపోయాడని, శనివారం హాజరవుతాడంటూ సెలవిచ్చారు. పైగా, ఈ కేసులో తన కుమారుడు అమాయకుడంటూ వాపోయారు. 
 
మరోవైపు, ఆశిష్ నేపాల్‌కు పారిపోవడం వల్లే విచారణకు హాజరు కాలేదని చెబుతున్నారు. దీంతో ఆయన ఇంటి గోడకు మరో నోటీసు అతికించారు. శనివారం విచారణకు హాజరు కావాలని, లేకుంటే చర్యలు తప్పవని అందులో హెచ్చరించారు. 
 
మరోవైపు, లఖింపూర్ ఘటనపై మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్.. అజయ్ కుమార్‌ను మంత్రి పదవి నుంచి తప్పించాలని, ఆశిష్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాదు, ఆశిష్‌ను అరెస్ట్ చేయాలంటూ పంజాబ్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ నిరాహారదీక్ష దిగారు. 
 
ఈ కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలంటే అజయ్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాల్సిందేనని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేయాల్సిందేనని, లేకుంటే ప్రధానమంత్రి నివాసం ఎదుట ఆందోళన చేపడతామని ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ హెచ్చరించారు.
 
అంతేకాకుండా, ఈ కేసులో యూపీ ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీసులు అనుసరిస్తున్న మెతకవైఖరిని కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇతర కేసుల్లో కూడా ఇలాగే వ్యవహరిస్తారా అంటూ నిలదీసింది. హేమయైన చర్యలకు పాల్పడిన నిందితుడిని విచారణకు రావాల్సిందిగా ప్రాధేయపడుతూ అభ్యర్థిస్తారా అంటూ ప్రశ్నించింది. పైగా, ఈ కేసుపై విచారణకు యూపీ సర్కారు నియమించిన ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటుపై కూడా విమర్శలు గుప్పించింది.