1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 11 అక్టోబరు 2021 (17:45 IST)

ఇంద్ర‌కీలాద్రిపై సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు ప‌టిష్ఠ ఏర్పాట్లు

ముఖ్యమంత్రి జ‌గ‌న్ దుర్గ గుడి పర్యటనకు చేపట్టవలసిన ఏర్పాట్లపై సోమవారం నగరంలోని ఇరిగేషన్ మోడల్ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ జె నివాస్ స‌మావేశం అయ్యారు. నగర పోలీస్ కమిషనర్ బి శ్రీనివాసులు, పోలీస్, దేవాదాయ, రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  ఈనెల 12న‌ మంగళవారం మ‌ధ్యాహ్నం మూడు గంటల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ఇంద్రకీలాద్రి కొండ పైకి  చేరుకుంటార‌ని చెప్పారు.  
 
అమ్మవారి జన్మదినం మూలా నక్షత్రం, సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చే కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమానికి అన్ని శాఖలు సమన్వయంతో ఎటువంటి లోటు పాట్లు లేకుండా విజయవంతం చేయాలన్నారు. ముఖ్యమంత్రి దుర్గ గుడి  పర్యటనలో సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా క్యూలైన్లలో తాగు నీరు అందుబాటులో ఉంచాలని, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ, దేవాదాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
 
మంగళవారం మూలా నక్షత్రం రోజున భక్తులకు టిక్కెట్లు అమ్మకాలు ఉండవని, ఉచిత దర్శనం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన అనంతరం భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట నుండి ఘాట్ రోడ్ లో ఎటువంటి వాహనాలను అనుమతించకూడదని కలెక్టర్ జె. నివాస్ అన్నారు.
 
నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసామని, విధులు నిర్వహించే పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. 
ముఖ్యమంత్రి  అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమం అనంతరం భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉన్నందున పోలీసు అధికారులు అప్రమత్తతో మెలగాలని నగర పోలీస్ కమిషనర్ ఆదేశించారు. మంగళవారం నుండి  చివరి మూడు రోజులు భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుందని పోలీస్ అధికారులు ఇతర శాఖల సమన్వయంతో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు మాధవిలత, శివశంకర్, మోహన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ , ఏసీపీ హనుమంతరావు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.