శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2022 (10:15 IST)

భార్యాభర్తల మధ్య ఘర్షణం - కొడుకుతో కలిసి రైలుకు ఎదురుగా నిలబడి భర్త...

suicide
పచ్చని సంసారంలో మనస్పర్థలు చిచ్చురేపాయి. భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్నపాటి గొడవలు చివరకు రెండు ప్రాణాలను బలితీసుకున్నాయి. అప్పటికే కుమార్తె చనిపోవడం, భార్యతో ఘర్షణ వంటి అంశాలు ఆ వ్యక్తిని తీవ్రంగా కుంగదీశాయి. దీంతో తన రక్తం పంచుకుని బిడ్డ ఆనవాలు కూడా కట్టుకున్న భార్య వద్ద ఉండకూడదని భావించాడు. కుమారుడితో కలిసి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా నిలబడి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. 
 
ఈ జిల్లాలోని మైలవరం చిన రామాలయం ప్రాంతానికి చెందిన రామారావు అనే వ్యక్తి బీఎడ్ పూర్తి చేసి రేషన్ షాపులో డీలర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈయనకు తొమ్మిదేళ్ల క్రితం దుర్గ అనే మహిళతో వివాహం కాగా, కుమారుడు గోపీనంద్, కుమార్తె మహాలక్ష్మిలు ఉన్నారు. 
 
అయితే, యేడాది క్రితం కుమార్తె మహాలక్ష్మి అనారోగ్యంతో కన్నుమూసింది. దీంతో రామారావు తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలో భార్య దుర్గతో విభేదాలు పొడచూపాయి. ఇవి తారాస్థాయికి చేరడంతో పచ్చని సంసారంలో చిచ్చు రేపాయి. ఇవి ఆయన్ను మరింతగా కుంగదీశాయి. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన కుమారుడిని తీసుకుని రేమిడిచర్ల రైల్వే గేట్ వద్దకు వెళ్లాడు. 
 
అక్కడ బైకును పార్క్ చేసి ట్రాక్‌పై వేగంగా వస్తున్న గూడ్సు రైలుకు ఎదురుగా నిలబడ్డాడు. రైలు ఢీకొనడంతో తండ్రీకుమారులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి. స్థానిక రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.