1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (12:52 IST)

గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం... వైకాపా నేతల అరాచకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్లాది మంది తెలుగు ప్రజలు ఆరాధ్యదైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్.టి.రామారావు విగ్రహాన్ని వైకాపా నేత ఒకరు ధ్వంసం చేశారు. ఈ దాడి ఘటన గుంటూరు జిల్లా దుర్గి గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మేల్కొన్న పోలీసులు... కేసు నమోదు చేసిన విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
అయితే, ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటన ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణని, ఈ చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ అన్నారు. తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జింపచేసిన మన అన్నగారు ఎన్టీఆర్ మహాపురుషుడని కీర్తించారు. అలాంటి మహనీయుని విగ్రహాన్ని ధ్వంసం చేయడం తెలుగు జాతిని అవమానపరిచినట్టేనని చెప్పారు. 
 
మరోవైపు, గుంటూరు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు. మాచర్ల టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి నేతృత్వంలో ఈ ధర్నా చేయగా, వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు.