శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జులై 2020 (16:39 IST)

"ప్రజలందరూ బాగుండాలనే చాతుర్మాస్య దీక్ష" : పవన్ కళ్యాణ్

ప్రజలందరూ బాగుండాలనే తాను చాతుర్మాస్య దీక్ష చేస్తున్నట్టు జనసేన పార్టీ అధినేత, సినీహీరో పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. "గృహస్తు ధర్మంలో ఉన్న నేను కొన్ని ప్రమాణాలు పాటించి, ఒంటి పూట భోజనం చేస్తూ కింద పడుకోవడం అన్నీ ఉంటాయి. ఈ దీక్ష కార్తీక మాసం వరకు ఉంటుంది" అని ప్రకటించారు. 
 
ఈ దీక్షలు చాతుర్మాస్య దీక్షలు. వ్రతాలుగానీ ఇప్పటివరకు నా వ్యక్తిగతంగా చేసే వాడిని. కాన్ఫరెన్స్ కాల్స్ ద్వారా ఎప్పటికపుడు రాష్ట్రంలో పరిస్థితిపై చర్చిస్తూ ఉంటే వివిధ వర్గాల ప్రజల ఈతిబాధలు నా దృష్టికి వచ్చాయి. నిస్సహాయ స్థితిలో ఉండి, ఆర్థికంగా మనం చేయాల్సింది చేసి కూడా కొన్నిసార్లు భగవంతుడినే శరణు వేడుకోవాల్సి వస్తుంది. 
 
అందుకే ఈ చాతుర్మాస్య దీక్షను కేవలం మన మనశ్శాంతి కోసం కాకుండా ప్రజలంతా బాగుండాలి అని మొదలుపెట్టాను. నాకిది మొదటి సంవత్సరం కాదు. 2003 నుంచి చేసుకుంటూ వెళుతున్నాను. అంతకుముందు అయ్యప్ప స్వామి మాల వేసుకుని దీక్ష చేసేవాడిని. అయితే, సినిమాలు చేస్తూ ఉండటం వల్ల అది బయటకి తెలేసిది కాదు.
 
ఇపుడు ప్రజా జీవితంలో ఉండటం వల్ల బయటకు వచ్చింది. సృష్టి స్థితికారకుడు విష్ణుమూర్తి శయనించే కాలం ఇది. ఇంలాంటి సమయంలోనే ఆయన భక్తులంతా, ఈ సంస్కృతిని గౌరవించేవారంతా చాతుర్మాస్య దీక్ష చేపడతారు. 
 
మఠాలు నడిపే యోగులు, సన్యాసం స్వీకరించిన వారు చేసే విధానం వేరుగా ఉంటుంది. గృహస్తు ధర్మంలో ఉన్న నేను కొన్ని ప్రమాణాలు పాటించి, ఒంటిపూట భోజనం చేస్తూ, కింద పడుకోవడం అన్నీ ఉంటాయి. ఈ దీక్ష కార్తీక మాసం వరకు ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు.