గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2024 (13:38 IST)

జగన్... నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటుంటే నమ్మి మోసపోయా.. : మాజీ మంత్రి రావెల

ravela
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా చిత్తు చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఇపుడు ఏకంగా 11 స్థానాలకు పరిమితమైంది. ఐదేళ్ళ పాటు అధికారంలో ఉన్న వైకాపాకు ఇపుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. దీంతో ఆ పార్టీలోని అనేక మంది సీనియర్ నేతలు ఓ ఓటమిని జీర్ణించుకోలేక, వైకాపాకు ఇక భవిష్యత్ లేదని గ్రహించి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి వారిలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ముందు వరుసలో నిలిచారు. ఆయన వైకాపాకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఆయన మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు. 
 
ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. తాను డాక్టర్ అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి పని చేశానని, 2014లో తనకు చంద్రబాబు రాజకీయంగా అవకాశం కల్పించారని గుర్తు చేశారు. 2014 ఏపీలో తొలి సాంఘిక సంక్షేమ శాఖామంత్రిగా పని చేసేందుకు అవకాశం కల్పించారని, ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. అయితే, కొన్ని కారణాలతో ఆ పార్టీలో ఇమడలేక వైకాపాలో చేరానని తెలిపారు. జగన్ నోటి వెంట పదేపదే నా ఎస్సీ, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ మాట్లాడుతుంటే నమ్మి మోసపోయానని చెప్పారు.
 
ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వంలో పని చేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదని గుర్తు చేశారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు రాజ్యాధికారం తెస్తానని మాట నమ్మి ఆ పార్టీ చేరగా, ఈ ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు ఆయనను తిరస్కరించారని చెప్పారు. ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమవుతుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు అఖండ విజయం ఇచ్చారని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు నాయుడుకి శుక్షాకాంక్షలు తెలుపుతున్నట్టు చెప్పారు.