గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (12:49 IST)

నెల్లూరులో వచ్చే నెల పదో తేదీ నుంచి రొట్టెల పండుగ

సెప్టెంబరు పదో తేదీ నుంచి 14వ తేదీ వరకు రొట్టెల పండుగ జరుగుతుందని, ఈ పండుగను సమర్థంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్‌ శేషగిరిబాబు తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఈ పండుగపై అధికారులతో ఆయన సమీక్షించారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రొట్టెల పండుగను రాష్ట్ర స్థాయి పండుగగా ప్రకటించిందని, ఐదు రోజులు ఈ పండుగ జరుగుతుందన్నారు. ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. లక్షలాది భక్తులు బారాషాహీద్‌ దర్గా, స్వర్ణాల చెరువుకు వచ్చే అవకాశం ఉన్నందున పండుగ రోజులలో తొక్కిసలాట జరుగకుండా, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 
 
యాత్రికులకు భద్రత కల్పించటంతో పాటు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు. బోటింగ్‌ వద్ద లైఫ్‌ జాకెట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య సదుపాయం కల్పించాలన్నారు. జిల్లా చరిత్ర, సంస్కృతి, పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కార్యక్రమాలు వివరించే ఛాయాచిత్ర పదర్శన ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యమైన ప్రదేశాలలో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలన్నారు. పండుగ రోజులలో గట్టి భద్రత ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వీరభద్రరావు, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఇస్మాయిల్‌ తదితరులు పాల్గొన్నారు.