1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 4 జూన్ 2021 (19:02 IST)

వైయస్ జగన్ వంటి సీఎం ఉండటం ఎపి పాడిరైతుల అదృష్టం: ఆర్‌ఎస్ సోధి, అమూల్ ఎండి

గ్రామీణ ఆర్థిక వ్యవస్థని, పాడిపరిశ్రమ సామర్థ్యంను సరిగ్గా గుర్తించిన శ్రీ వైయస్ జగన్ వంటి సీఎం ఉండటం ఆంధ్రప్రదేశ్‌లోని పాడి రైతుల అదృష్టమని అమూల్ ఎండి ఆర్‌ఎస్ సోధి అన్నారు. పశ్చిమగోదావరిజిల్లాలో జగనన్న పాలవెల్లువలో భాగంగా అమూల్ పాలసేకరణను ప్రారంభించిన సందర్భంగా వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడారు.

శ్రీ వైయస్ జగన్ తన పాదయాత్ర సందర్బంగా ఆంధ్రప్రదేశ్‌లోని పాడిరైతుల కష్టాలను స్వయంగా గుర్తించారని, తాను సీఎం అయిన తరువాత వాటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఎపిలో పాడిపరిశ్రమకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఈ రంగంలో అగ్రస్థానంలో ఉన్న అమూల్‌ను ఆహ్వానించడం సంతోషకరమని అన్నారు.

భారతదేశంలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, తరువాత రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఉన్నాయని, నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలుస్తోందని అన్నారు. గుజరాత్ అయిదో స్థానంలో ఉందని అన్నారు. ఎపిలో రోజుకు 4.12కోట్ల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని, దీనివిలువ ఏడాదికి రూ.7వేల కోట్ల రూపాయలని గుర్తు చేశారు.

గుజరాత్‌లో ఏరకంగా అయితే అమూల్‌ వల్ల పాడిరైతులకు మేలు జరిగిందో, అలాగే ఎపిలో కూడా మేలు జరుగుతుందని అన్నారు. అమూల్‌ సంస్థకు రైతులే నిజమైన యజమానులని, ఇతర కార్పోరేట్, మల్లీనేషన్ కంపెనీల మాదిరిగా లాభాలను మాత్రమే ఆర్జించడం అమూల్ లక్ష్యం కాదని అన్నారు. ఎపి ప్రభుత్వ సహకారంతో అన్ని జిల్లాల్లోనూ మహిళా రైతుల భాగస్వామ్యంతో సహకార వ్యవస్థ ద్వారా పాల సేకరణ జరుగుతుందని, నాణ్యమైన పాలను, ఇతర ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రజలకు చేరువ చేస్తామని అన్నారు.

ఇందుకోసం అమూల్ తనకు ఈ రంగంలో ఉన్న నైపూణ్యాలను రైతులకు పంచుతుందని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో నాణ్యమైన పాలు ఉత్పత్తి అవుతాయని, మార్కెట్‌లో ఈ పాలకు మంచి ఆదరణ ఉంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో పాడిరైతుల సహకార సంస్థ చేతుల్లోనే యాబైశాతం మార్కెట్ ఉంటుందని ఈ సందర్బంగా విశ్వాసం వ్యక్తం చేశారు.