శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (17:41 IST)

ఆనందయ్య కరోనా మందుకు కొత్త పేరు.. ఏంటది?

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనా బాధితులకు నాటు మందును తయారు చేసి అందజేస్తున్నారు. ఈ మందుకు ఇపుడు కొత్త పేరు పెట్టారు. ఔషధ చక్ర అనే పేరుతో ఇకపై ఆనందయ్య మందును ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 
 
కాగా, అనేక పరిణామాల నేపథ్యంలో ఆనందయ్య మందుకు అటు ఏపీ హైకోర్టు, ఇటు ఏపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆనంద‌య్య మందు త‌యారీ పెద్ద ఎత్తున ప్రారంభ‌మవుతోంది.
 
ఇందుకోసం కృష్ణ‌ప‌ట్నం పోర్టుకు సమీపంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్ప‌టికే త‌యారీకి అవ‌స‌ర‌మైన సామ‌గ్రిని కృష్ణ‌ప‌ట్నం పోర్టుకు త‌ర‌లించే ప‌నులు మొద‌లు పెట్టారు. ప్ర‌స్తుతం కృష్ణపట్నం పోర్టుకు చెందిన సీవీఆర్‌ కాంప్లెక్స్‌లో మూలిక‌లు, దినుసులు సిద్ధం చేసుకోవడంలో ఆనందయ్య బృందం బిజీగా ఉంది.
 
వీటి సేకరణ పూర్తయిన తర్వాత రెండురోజుల్లో మందు తయారీ ప్రారంభమవుతుంది. ఎమ్మెల్యే కాకాని గోవర్ధనరెడ్డి సూచన మేరకు మొదట సర్వేపల్లి నియోజకవర్గంలో లక్షమందికి కరోనా రానివారు వాడే మందును అందజేయాలని ఆనంద‌య్య బృందం నిర్ణ‌యించింది. 
 
అనంత‌రం కరోనా రోగులకు అవసరమైన ‘పి, ఎల్, ఎఫ్‌’ రకాల మందు పంపిణీ చేస్తారు. ఆ త‌ర్వాతే ఇతర నియోజకవర్గాలకు పంపిణీ చేయ‌నున్నారు. ఈ ఔషధ చక్ర మందును ఆన్‌లైన్‌లో కూడా పంపిణీ చేయనున్నారు.