శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (15:46 IST)

వివేకా కేసు విచారణ నిష్పక్షిపాతంగా జరగలేదు.. జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర : సజ్జల రామకృష్ణారెడ్డి

sajjala ramakrishna reddy
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ నిష్పక్షపాతంగా జరపడం లేదని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ముఖ్యమంగా తమ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. 
 
వివేకా హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపాకు చెందిన కడప ఎంపీ వైఎస్.అవినాశ్ రెడ్డిని ఈ కేసు విచారణ నిమిత్తం సీబీఐ మరోమారు విచారణకు పిలిచింది. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలకమైన విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వివేకా హత్య కేసు విచారణ నిష్పక్షిపాతంగా జరగడం లేదని అన్నారు. కొందరిని టార్గెట్ చేస్తూ విచారణ చేస్తున్నారని అన్నారు. 
 
వివేకా ఫోనులోని డేటా రికార్డులను ఎందుకు డిలీట్ చేశారని ఆయన ప్రశ్నించారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఫోన్ రికార్డులు ఎందుకు చూడలేదని నిలదీశారు. వివేకా కుటుంబంలోనే విభేదాలు ఉన్నాయని ఆయన చెప్పారు. పైగా, వివేకా హత్య కేసుతో ఎంపీ అవినాశ్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. వివేకా బావమరిది శివప్రకాషశ్ రెడ్డి ఫోన్ చేస్తేనే అవినాశ్ రెడ్డి .. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లారని చెప్పారు. పైగా, ఈ కేసులో అవినాశ్ రెడ్డితో సంబంధం ఉన్నట్టు ఎక్కడా ఒక్క ఆధారం కూడా లభ్యం కాలేదని సజ్జల పునరుద్ఘాటించారు. 
 
ముఖ్యంగా, వివేకా హత్యకు, రెండో పెళ్ళికి సంబంధం ఉందని ఓ పత్రికలో వార్తలు రాశారన్నారు. మరీముఖ్యంగా కుటుంబ సభ్యులంతా కలిసి వివేకా చెక్ పవర్ తీసేశారని, కుటుంబ సభ్యులందరూ ఆయనను ఏకాకిని చేశారని కథనాలు వచ్చాయని చెప్పారు. కొద్దిపాటి డబ్బు కోసం కూడా ఆయన ఇబ్బందులు పడాల్సి వచ్చిందని అందులో వివరించారు అని సజ్జల వెల్లడించారు. 
 
వివేకా చుట్టూ నేరప్రవృత్తి ఉన్న మనుషులు ఉన్నారని, వివేకా హత్య జరిగింది చంద్రబాబు హయాంలోనే అని స్పష్టం చేశారు. కుట్రదారుల గోల్ న్యాయం జరగాలని కాదని అన్నారు. సీఎం జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. వివేకాను చంపిన అసలు హంతకులను పట్టుకోవాలని సజ్జల డిమాండ్ చేశారు.