గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2023 (07:12 IST)

వైకాపాలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశం.. సీఎం జగన్ సీరియస్

kotamreddy
అధికార వైకాపాలో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రకంపనలు రేపుతోంది. సొంత పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ వైకాపా ఎమ్మెల్యే, వైఎస్ కుటుంబ వీర విధేయుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ అంశం ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. 
 
బుధవారం తాడేపల్లిలోని తన నివాసంలో సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు హోం సెక్రటరీ, నిఘా విభాగం అధిపతి సీతారామాంజనేయులు, ఇతర ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన ఆరోపణలపై సుధీర్ఘంగా చర్చించారు. పైగా, ఈ వ్యవహారంపై రాష్ట్ర హోం శాఖతో ఓ ప్రకటన చేయించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
కాగా, వైఎస్. రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు తాను ఎంతో విధేయుడిగా ఉన్నాని, అలాంటిది తన ఫోనును ట్యాప్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు కోటంరెడ్డి బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. పైగా, తన ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలను కూడా ఆయన బహిర్గతం చేశారు. 
 
అంతేకాకుండా, తనపై నమ్మకం లేనిచోట తాను ఉండలేనని, తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే వెల్లడిస్తానని ప్రకటించారు. తన ఫోన్ ట్యాప్ చేసిన ఆధారాలను తాను బహిర్గతం చేశానని, దీనిపై పార్టీ పెద్దలే సమాధానం చెప్పాలన్నారు. దీంతో సీఎం జగన్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు.