1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. SEC Nimmagadda Ramesh Kumar Appreciates AP CS and DGP

ఏపీ సీఎస్ డీజీపీలను అభినందించిన నిమ్మగడ్డ.. 539 పంచాయతీలు ఏకగ్రీవం

SEC Nimmagadda Ramesh Kumar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్‌లను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఏపీ సీఎస్, డీజీపీలు గురువారం ప్రత్యేకంగా నిమ్మగడ్డతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరితో పాటు.. పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీని కూడా ఆయన అభినందించారు. 
 
కాగా, ఏపీలో ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు కూడా వచ్చిన నేపథ్యంలో ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కలిశారు. 
 
విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లిన ఆదిత్యనాథ్ దాస్, గౌతమ్ సవాంగ్.... ఎస్ఈసీతో భేటీ అయ్యారు. తొలి దశ ఎన్నికలు విజయవంతం కావడం, ప్రశాంత వాతావరణంలో జరగడం పట్ల వారిద్దరినీ ఎస్ఈసీ నిమ్మగడ్డ అభినందించారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు మెరుగైన చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు.
 
అంతేకాదు, మిగిలిన మూడు విడతల పంచాయతీ ఎన్నికల నిర్వహణపైనా ఎస్ఈసీ... సీఎస్, డీజీపీలతో చర్చించారు. అనుసరించాల్సిన విధివిధానాలపై రాష్ట్ర ఉన్నతాధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కాగా, ఈ సమావేశంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్, సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్ మధ్య పలు సందర్భాల్లో నవ్వులు విరబూశాయి.
 
ఇకపోతే, తొలి దశ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరుణంలో రెండో దశ పోలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండో దశ ఏకగ్రీవాలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ప్రకటించారు. అన్ని జిల్లాల్లో కలిపి 539 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని ఆయన తెలిపారు. 
 
మొత్తం 13 జిల్లాల్లో 167 మండల పరిధిలోని 3,328 గ్రామ పంచాయతీల్లో రెండో దశ ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. ఏకగ్రీవాలు పోగా 2,786 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13న రెండో విడత పోలింగ్ జరగనుంది.
 
అనంతపురం - 15, గుంటూరు - 70, ప్రకాశం - 69, చిత్తూరు - 62, విజయనగరం - 60, కర్నూలు - 57, శ్రీకాకుళం - 41, కడప - 40, కృష్ణా - 36, నెల్లూరు - 35, విశాఖ - 22, తూర్పుగోదావరి - 17, పశ్చిమగోదావరి - 15 గ్రామ పంచాయతీలు ఉన్నట్టు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
డిగ్రీ పట్టా స్వీకరించేలోపు పది మొక్కలు నాటాల్సిందే... ఎక్కడ?