1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (12:22 IST)

ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికల్లో ఓటు వేయాలి : నిమ్మగడ్డ రమేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో భాగంగా, తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా చేపట్టగా, అధికార వైకాపా అధిక స్థానాలను కైవసం చేసుకుని ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో తొలి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం పట్ల రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో తొలిదశ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడం సంతోషదాయకమన్నారు. 
 
పెద్ద సంఖ్యలో ఓటర్లు స్వచ్ఛందంగా, ఉత్సాహంతో పాల్గొనడం ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరుస్తుందన్నారు. ఎన్నికల సిబ్బంది అంకిత భావంతో, నిబంధనలతో పనిచేయడం సంతోషాదాయకమన్నారు. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది శాంతిభద్రతల నిర్వహణ సవాల్‌గా తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారని, పోలీస్ సిబ్బందిని అభినందిస్తున్నానని అన్నారు. 
 
తొలిదశ ఎన్నికలలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులు పూర్తి సమన్వయంతో వ్యవహరించిన తీరు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. రెండవ దశ ఎన్నికలలో ప్రజలు స్వేచ్ఛగా ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కుని వినియోగించుకోవాలని నిమ్మగడ్డ పిలుపు ఇచ్చారు.
 
మరోవైపు, ఏపీ పంచాయతీలకు జరిగిన తొలి విడత ఎన్నికల ఫలితాల వెల్లడిలో భాగంగా కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కందలంపాడులో ఆసక్తికర ఫలితం వచ్చింది. కందలంపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బైరెడ్డి నాగరాజు విజయం సాధించారు. నాగరాజు వైసీపీ మద్దతుదారుడు. విశేషం ఏంటంటే, నాగరాజు కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు.
 
కందలంపాడు చాలా చిన్న గ్రామం. ఈ గ్రామంలో మొత్తం ఓట్లు 203. నాగరాజుకు 102 ఓట్లు రాగా, అతని ప్రత్యర్థి సుబ్రహ్మణ్యంకు 101 ఓట్లు లభించాయి. కేవలం ఒక్క ఓటు నాగరాజుకు సర్పంచ్ పీఠాన్ని ఖరారు చేసింది. అధికారులు రీకౌంటింగ్ చేసినా ఏమార్పు లేకపోవడంతో నాగరాజే విజేత అంటూ అధికారికంగా ప్రకటించారు.