1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. SSC examinations will be held from March 15 to 29th 2018, Exam Timetable released

ఏపీలో మార్చి 15 నుంచి 29 వరకు పదో తరగతి పరీక్షలు, టైంటేబుల్ ఇదే...

అమరావతి: ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షలు 2018 మార్చి 15 నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన చాంబర్‌లో మంత్రి గురువారం ఉదయం ఎస్ఎస్‌సీ పరీక్షల టైంటేబుల్ విడుదల చేశారు

SSC examinations
అమరావతి: ఈ విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షలు 2018 మార్చి 15 నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన చాంబర్‌లో మంత్రి గురువారం ఉదయం ఎస్ఎస్‌సీ పరీక్షల టైంటేబుల్ విడుదల చేశారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.15 వరకు జరుగుతాయని, కంపోజిట్ కోర్సులకు మరో అర్థగంట అదనంగా ఉంటుందని 12.45 వరకు జరుగుతాయని తెలిపారు.  
 
2016లో 6,17,030 మంది విద్యార్థులు, 2017లో 6,09,502 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యారని, 2018లో 6,36,831 మంది హాజరుకానున్నట్లు వివరించారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 18 వరకు స్పాట్ వాల్యూషన్ జరుగుతుందని, మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడిచాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
 
పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కింద కూర్చొని పరీక్షలు రాయవలసిన అవసరంలేదని, 100 శాతం ఫర్నీచర్ సమకూరుస్తామని, లేనిచోట అద్దెకు తీసుకోమని కూడా సంబంధిత అధికారులకు చెప్పినట్లు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో త్రాగునీటి సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్ అందుబాటులో ఉంచుతామని, ప్రత్యేక బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. 
 
పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేస్తారని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారని, సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడామని, మళ్లీ ఒకసారి మాట్లాడి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులు కూడా చివరి నిమిషంలో కంగారుగా రాకుండా ఒక అర్థగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని మంత్రి సూచించారు. 
 
పరీక్షల టైం టేబుల్
మార్చి 15న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (గ్రూప్-ఏ), 15న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 కాంపోజిట్ కోర్స్, 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్- II (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్- II కాంపోజిట్ కోర్స్, ఓఎస్ఎస్ సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్), 17న సెకండ్ లాంగ్వేజ్, 19న ఇంగ్లీష్ పేపర్-1, 20న ఇంగ్లీష్ పేపర్-II, 21న మ్యాథ్స్ పేపర్-1, 22న మ్యాథ్స్ పేపర్-II, 23న జనరల్ సైన్స్ పేపర్-1, 24న జనరల్ సైన్స్ పేపర్-II, 26న సోషల్ స్టడీస్ పేపర్-1, 27న సోషల్ స్టడీస్ పేపర్-II, 28న ఓఎస్ఎస్ సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్- II (సంస్కృతం, అరబిక్, పర్షియన్), 29న ఎస్ఎస్ సి ఒకేషనల్ కోర్స్ (థియరీ) పరీక్షలు జరుగుతాయని మంత్రి వివరించారు. 
 
త్వరలో డీఈఓల నియామకం
డీఈఓల నియామకం విషయమై విలేకరులు ప్రశ్నించగా, కొంతమందిపై  ఆరోపణలు రావడంతో నియామకాలను నిలిపామని, రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఒక కమిటీ విచారణ జరిపిందని, ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చిందని, ముఖ్యమంత్రితో చర్చించి ఆ నివేదిక ఆధారంగా త్వరలో అన్ని జిల్లాలకు డీఈఓలను నియమిస్తామని మంత్రి చెప్పారు. డీఈఓలకు సంబంధించి రెండు జాబితాలు ఉన్నాయని, ఒకేసారి రెండిటినీ పూర్తి చేయాలా? లేక మొదట ఒక జాబితాలో వారిని నియమించి, తరువాత రెండవ జాబితాలో వారిని నియమించాలనా? అనే విషయమై స్పష్టతరావలసి ఉందని, పరిస్థితిని సీఎం సమీక్షించిన తరువాత ఒక నిర్ణయం తీసుకుంటారన్నారు. డిఈఓల నియామకం జరిగిన తరువాత తాను, విద్యాశాఖ ఉన్నతాధికారులు విడతల వారీగా అన్ని జిల్లాలు పర్యటిస్తామని, కాలేజీలను, పాఠశాలలను తనిఖీ చేస్తామని చెప్పారు.
About Writer
chj
తర్వాతి కథనం
జయ గ్రూప్స్ పైన ఐటీ దాడులు కేంద్రం చలవే... వెనుక పళనిస్వామి వున్నారా?