శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (10:22 IST)

ఆ విద్యార్థిని నాకు నచ్చింది.. అందుకే ఫోన్ నంబర్ అడిగా....

పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. పరీక్షా కేంద్రంలో పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థినిపై మనసుపడి, ఆమె ఫోన్ నంబరు కావాలని ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వారంతా వచ్చి ఇన్విజిలేటర్‌కు దేహశుద్ధి చేశారు. 
 
ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని తిమ్మాపూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పిరశీలిస్తే, తిమ్మాపూర్‌లో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ వుంది. ఇక్కడ ఓ విద్యార్థిని బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈమె సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు మరో ఇంజినీరింగ్‌ కాలేజీకి వెళ్లింది. 
 
అక్కడ ఆమె పరీక్ష రాసే గదిలో ఇన్విజిలేటర్‌‌గా బట్టు వెంకటేశ్‌ అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. ఎగ్జామ్ హాల్‌లోకి వచ్చినప్పటి నుంచి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. సెల్ ఫోన్ నెంబరు ఇవ్వాలని వేధించాడు.
 
అప్పుడే ఎదురుతిరిగి నాలుగు వాయిద్దామని ఆ విద్యార్థిని ఆలోచించినా, తన పరీక్షకు ఆటంకం కలుగుతుందని మిన్నకుండిపోయింది. పరీక్ష అనంతరం తాను చదివే కాలేజికి వెళ్లి, వెంకటేశ్ ప్రవర్తనపై ప్రిన్సిపాల్‌‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కాలేజ్ సిబ్బంది, వెంకటేశ్‌‌ను పిలిపించారు. 
 
ఎందుకలా చేశావని అడిగితే, తనకు ఆ అమ్మాయి నచ్చిందని, అందుకే ఫోన్ నంబర్ అడిగానని చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహంతో కాలేజీ సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు అతన్ని చితక్కొట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటేశ్‌‌ను అదుపులోకి తీసుకున్నారు.