గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 25 జులై 2019 (12:46 IST)

నేనుండగా ఇంకొకతి కావాల్సివచ్చిందిరా... భర్తను యువతిని చితక్కొట్టిన భార్య

ఓ మహిళ అపరభద్రకాళిగా మారిపోయింది. తనను నిర్లక్ష్యానికి గురిచేస్తూ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను చితక్కొట్టింది. పనిలో పనిగా తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను కూడా ఆమె చావబాదింది. ఈ సంఘటన హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్‌ నగరంలో కొత్తకొమ్మగూడెంకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తికి సౌజన్య అనే మహిళను ఇచ్చి పెద్దలు పెళ్ళి చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భార్యను వదిలిపెట్టిన లక్ష్మణ్... తరచుగా కూకట్‌పల్లికి వెళ్లి వచ్చేవాడు. 
 
అక్కడి ప్రగతినగర్‌లో నివసించే ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె... తనకు అన్యాయం చెయ్యవద్దని కోరింది. అయినా లక్ష్మణ్ పట్టించుకోలేదు. అలాగైతే... తనకు విడాకులు ఇచ్చేయమని కోరింది. అయినప్పటికీ విడాకులు ఇవ్వకుండా నాటకాలు ఆడసాగాడు.
 
ఈ సమస్య మరింతగా జఠిలమైంది. తనతో పాటు పిల్లల బాగోగులను ఏమాత్రం పట్టించుకోవడం మానేశాడు. ఏం చెయ్యాలో, తన సమస్యను ఎవరికి చెప్పుకోవాలో ఆ మహిళకు అర్థం కాలేదు. తన పిల్లల భవిష్యత్ తలసుకుని కుమిలిపోయింది. 
 
ఇక లాభంలేదని గ్రహించిన ఆమె.. తన భర్త రాకపోకలపై దృష్టిసారించింది. తన బంధువులతో కలిసి... తిన్నగా ప్రగతి నగర్ వెళ్లి... అతన్ని, ఆమెనూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత ఇద్దర్నీ చితకబాదారు. పిడిగుద్దులు కురిపించారు. చెప్పుతో కొట్టారు. ఆ తర్వాత ఇద్దర్నీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారిస్తున్నారు.