1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. We will form a joint committee and select the Tirupati candidate: Pawan

ఉమ్మడి కమిటీ వేసి తిరుప‌తి అభ్యర్థిని ఎంపిక చేస్తాం: పవన్

joint committee
రెండు పార్టీలతో ఉమ్మడి కమిటీ వేసి తిరుప‌తి ఉప ఎన్నిక‌కు అభ్యర్థిని ఎంపిక చేస్తామని జ‌నసేప పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఢిల్లీలోని న‌డ్డా నివాసంలో భేటీ అయ్యారు.

తిరుపతి ఉప ఎన్నిక, ఏపీ పరిణామాలపై చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల బరి నుంచి జనసేన తప్పుకుంది. ఇక్కడ బీజేపీకి మద్దతు తెలిపింది. దీంతో తిరుపతి టికెట్ తమకు వదిలేయాలంటూ జనసేన పార్టీ కోరుతోంది. ఇదే అంశంపై నడ్డాతో పవన్‌కల్యాణ్ చర్చించిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే తిరుపతి టికెట్‌పై రాష్ట్ర బీజేపీ ఆశలు పెట్టుకుంది. దీనిపై సమీక్షలు కూడా నిర్వహించింది.

జనసేనతో కలిసి పని చేస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి బరిలో జనసేన అభ్యర్థి ఉంటారా? లేక బీజేపీ అభ్యర్థి ఉంటారా? అన్న అంశంపై సస్పెన్ష్ కొనసాగుతోంది. న‌డ్డాతో భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. అమరావతి, పోలవరం అంశాలపై నడ్డాతో మాట్లాడామని చెప్పారు. అమరావతి రైతులకు బీజేపీ, జనసేన పార్టీల మద్దతు ఉంటుందన్నారు.

భేటీలో ప్ర‌ధానంగా అమరావతిలోని ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని నడ్డా హామీ ఇచ్చారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, శాంతిభద్రతల సమస్యలు, ఆలయాలపై దాడుల గురించి కూడా చర్చించామని చెప్పారు. దేవాలయాల పరిరక్షణకు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై స్పష్టతను ఇవ్వాలని కోరామని తెలిపారు.

పోలవరం ప్రజల కోసమే కానీ, పార్టీలకు మేలు చేసేందుకు కాదని నడ్డా చెప్పారని అన్నారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో పోటీ చేస్తామని తెలిపారు. రెండు పార్టీలతో ఉమ్మడి కమిటీ వేసి అభ్యర్థిని ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారనే విషయాన్ని ఆ తర్వాత ప్రకటిస్తామని ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెల్ల‌డించారు.
తర్వాతి కథనం
తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు