1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (15:41 IST)

జామ ఆకుల నీటిని ఆవిరి పట్టిస్తే..?

సాధారణంగా గర్భిణి స్త్రీలు వాంతులతో బాధపడుతుంటారు. మందులు వాడాలనుకుంటారు. కానీ, పెద్దలేమో గర్భిణిగా ఉన్నప్పుడు ఎటువంటి మందులు వాడకూడదని చెప్తుంటారు. అయితే ఏం చేయాలి. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలని చింతిస్తుంటారు. అందుకు జామ ఆకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. మరి జామ ఆకులోని ఔషధ గుణాలేంటో చూద్దాం..
 
1. జామ ఆకులను బాగా ఎండబెట్టుకుని పొడిచేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా ఉప్పు కలిపి తింటే వాంతి సమస్య తగ్గుతుంది. దీనిలోని పోషక విలువలు శరీర రోగనిరోధకశక్తిని కూడా పెంచుతాయి. తద్వారా ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు.
 
2. జలుబు విపరీతంగా ఉన్నప్పుడు జామ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిలో కొద్దిగా పసుపు కలిపి ఆవిరి పట్టించాలి. ఇలా క్రమంగా చేస్తే జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
3. పచ్చి జామ ఆకులను శుభ్రం చేసుకుని అందులో కొద్దిగా చింతపండు, ఉప్పు వేసి తీసుకుంటే చిగుళ్ల నుండి రక్తం కారదు. దంతాలు దృఢంగా ఉంటాయి. పుచ్చి పళ్లు గలవారు జామ ఆకు పొడిని ఆ ప్రాంతంలో పెట్టుకుంటే అందులోని చెడు బ్యాక్టీరియాలు తొలగిపోయి దంతాలు ఆరోగ్యంగా మారుతాయి. 
 
4. జామ కాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిల్లో కొద్దిగా కారం, ఉప్పు చల్లుకుని తింటే నోటికి రుచిగా, ఆరోగ్యానికి ఔషధంగా, అందానికి సౌందర్య సాధణగా దోహదపడుతుంది. 
 
5. జామ ఆకుల పొడిలో కొద్దిగా గుడ్డు తెల్లసొన, కీరదోస పేస్ట్ కలిపి జుట్టు రాసుకోవాలి. రెండుగంటల పాటు అలానే ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య ఉండదు. జుట్టు రాలకుండా ఉంటుంది. 
 
6. జామ పండ్ల పేస్ట్‌లా చేసి అందులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చన్నీటితో కడుక్కోవాలి. దాంతో ముఖం తాజాగా, మృదువుగా మారుతుంది.