గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 1 నవంబరు 2019 (22:13 IST)

చైనాలో 5జీ నెట్‌వర్క్ ప్రారంభం, ప్రపంచ టెక్నాలజీలో భారీ ముందడుగు

చైనాలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. దీనితో చైనా ప్రపంచస్థాయిలో టెక్నాలజీ పరంగా ఒక పెద్ద ముందడుగు వేసినట్లయింది. చైనాలోని ప్రభుత్వ మొబైల్ ఆపరేటర్లు చైనా మొబైల్, చైనా యూనికామ్, చైనా టెలీకామ్ గురువారం నుంచి తమ 5జీ డేటా ప్లాన్లు ప్రకటించాయి. ట్రేడ్, టెక్నాలజీ అంశాల్లో చైనా-అమెరికా ఢీ అంటే ఢీ అంటున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది.

 
చైనా కంటే ముందు దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్ తమ దేశాల్లో ఈ ఏడాది 5జీ నెట్‌వర్క్ ప్రారంభించాయి. 5జీ అయిదో జనరేషన్ మొబైల్ నెట్‌వర్క్. 5జీలో ఇంటర్నెట్ స్పీడ్ చాలా వేగంగా ఉంటుందని చెబుతున్నారు.

 
5జీ డేటా ప్లాన్ ధర ఎంత?
మొదట్లో వచ్చే ఏడాది నుంచి 5జీ సేవలు ప్రారంభిస్తామని చెప్పిన చైనా, తర్వాత ఆ చర్యలను వేగం చేసి, ఇదే ఏడాది 5జీ సేవలు అందించింది. ఈ సూపర్ ఫాస్ట్ సేవలు చైనాలోని 50 నగరాల్లో ప్రారంభమయ్యాయి. వీటిలో బీజింగ్, షాంఘాయ్ ఉన్నాయి. 5జీ డేటా ప్లాన్ ధరలు 128 యువాన్ల(దాదాపు 1300 రూపాయలు) నుంచి 500 యువాన్ల(6 వేల రూపాయలు) వరకూ ఉన్నాయని చైనా ప్రభుత్వ సమాచార సంస్థ షిన్హువా చెప్పింది.

 
చైనాలో 5జీ సేవలు ప్రారంభించే నెట్‌వర్క్‌కు సంబంధించిన ఎక్కువ పరికరాలను హువావే కంపెనీ సరఫరా చేసింది. మిగతా చాలా దేశాల్లో 5జీ నెట్‌వర్క్ ఏర్పాటు చేయడంలో ఈ కంపెనీ కీలక పాత్ర పోషిస్తోంది. హువావే కంపెనీని అమెరికా బ్లాక్‌లిస్టులో పెట్టడం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఆ కంపెనీ వల్ల తమ జాతీయ భద్రతకు ముప్పు ఉందని అమెరికా చెప్పింది.

 
హువావే స్వయంగా తమపై వచ్చిన అన్ని ఆరోపణలను ఖండించింది. అమెరికా చర్యలను చైనాలో కూడా ట్రేడ్ వార్‌లా చూస్తున్నారు.