శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 17 జూన్ 2022 (19:31 IST)

K-pop supergroup BTS: ఆరంభం నుంచి విరామం దాకా బీటీఎస్ సూపర్ గ్రూప్ ప్రస్థానం

BTS
సోలో కెరియర్ మీద దృష్టి పెట్టడానికి బ్యాండ్ నుంచి కొంత విరామం తీసుకుంటున్నట్లు కె-పాప్ సూపర్ గ్రూప్ బీటీఎస్ సభ్యులు ఇటీవల ప్రకటించారు. దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల డాలర్లను ఆర్జించి పెట్టారన్న పేరు తెచ్చుకున్న ఈ ఏడుగురు పెర్ఫార్మర్లు తమ గ్రూపు ఫెస్టా పేరుతో ప్రతియేటా జరుపుకునే డిన్నర్ సందర్భంగా ఈ బాంబు పేల్చారు. ఈ సందర్భంగా అసలు బీటీఎస్ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, ఎలా సాగింది అన్నది ఒక్కసారి పరిశీలిద్దాం.

 
తొలి సింగిల్
ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న కె-పాప్ గ్రూప్ ఆరంభంలో చాలా సాదాసీదాగా మొదలైంది. వరల్డ్ టాప్ చార్ట్ లోకి వెళ్లిన వారి మొదటి ఆల్బమ్ నో మోర్ డ్రీమ్ 2013 జూన్ 12న విడుదలైంది. అయితే, దక్షిణ కొరియా చార్ట్‌లో ఇది 124వ స్థానంలో నిలిచింది. దాదాపు 50,000 కాపీలు అమ్ముడయ్యాయి.

 
డైనమైట్
అతి కొద్ది కాలంలోనే బీటీఎస్‌కు ఫాలోయర్లు ఏర్పడ్డారు. బ్యాండ్ మంచి సక్సెస్‌ను సాధించింది. 2020లో కరోనా మహమ్మారి సమయంలో కాన్సర్ట్స్ నిర్వహించకపోయినా, డైనమేట్ అనే సింగిల్ యూఎస్ బిల్‌బోర్డ్ చార్ట్‌లో నం.1 స్థానం సాధించిన మొదటి పాటగా చరిత్ర సృష్టించింది. ఈ బృందం రెండుసార్లు గ్రామీకి నామినేట్ అయ్యింది. కానీ, అవార్డును గెలుచుకోలేదు.

 
బీటీఎస్ ఆర్మీ
ఈ గ్రూప్‌కు ఆన్లైన్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. వీరి ఫ్యాన్స్ గ్రూప్‌ను ఆర్మీ (ARMY- Adorable Representative M.C. For Youth) పేరుతో ఒక గ్రూప్‌గా ఏర్పడ్డారు. ఇది ఒక బలమైన గ్రూప్‌గా మారుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఓక్లహోమాలోని తుల్సాలో జరిగిన ప్రచార ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ ఊహించిన దానికంటే తక్కువ సంఖ్యలో ప్రజలు హాజరు కావడానికి కొంత వరకు కె-పాప్ ఫ్యాన్స్, టిక్ టాక్ యూజర్లే కారణమన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

 
జంగ్‌కూక్ కారు ప్రమాదం
2019లో, గ్రూప్ సభ్యుడు 22 ఏళ్ల జంగ్‌కూక్ తన కారును టాక్సీతో ఢీకొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో బీటీఎస్ ఫ్యాన్స్ ఆయనకు మద్ధతుగా నిలిచారు. అయితే, కె-పాప్ అభిమానులు ఈ వార్తను కప్పిపుచ్చడానికి స్పామింగ్ హ్యాష్ ట్యాగ్‌లను ఉపయోగించారని ఒక యూ ట్యూబ్ స్టార్ ఫార్వార్డ్ చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. అయితే ఈ ఆరోపణలు ధృవీకరణ కాలేదు. కానీ దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

 
ఐక్యరాజ్యసమితి
2021లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలను దక్షిణ కొరియా పాప్ బ్యాండ్ ప్రి-రికార్డెడ్ కార్యక్రమంతో ప్రారంభించారు. ఇది చాలా అరుదైన ఘటన. ఈ బృందాన్ని దక్షిణ కొరియా భవిష్యత్తు తరాలు, సంస్కృతికి అధ్యక్షుడి తరఫు ప్రత్యేక ప్రతినిధులుగా మాజీ అధ్యక్షుడు మూన్ జే-ఇన్ నియమించారు.

 
వైట్ హౌస్
అమెరికా అధ్యక్ష భవనంలో కూడా బీటీఎస్ మానియా కనిపించింది. 2022లో ఈ బృందం వైట్ హౌస్‌ను సందర్శించింది. ఆసియా ప్రజలపై విద్వేషం పెరుగుతోందంటూ ఈ టీమ్ అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిసి నివేదించింది. కోవిడ్ పేరుతో ఆసియన్లపై దాడులు పెరుగుతున్నాయని ఈ బృందం ఆందోళన వ్యక్తం చేసింది. గత సంవత్సరం అధ్యక్షుడు బైడెన్ కోవిడ్ -19 హేట్ క్రైమ్స్ యాక్ట్‌ పైన సంతకం చేశారు. ఇది ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయి పసిఫిక్ ద్వీపాల వాసులపై జరిగే నేరాలను పరిశోధించడానికి వనరులను అందిస్తుంది.