శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 మార్చి 2021 (11:18 IST)

రైల్వే స్టేషన్లలో ఫ్లాట్‌ఫాం టికెట్‌ బాదుడు : బోర్డులో రూ.10 .. పెన్నుతో రూ.30

హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లల ప్లాట్‌ఫాం టికెట్‌ ధరలను ఒక్కసారిగా పెంచేశారు. దేశవ్యాప్తంగా రూ.10గా ఉన్న ధరను ఆయా స్టేషన్ల రద్దీకనుగుణంగా రూ.30 వరకు పెంచుకునే అవకాశం ఇవ్వడంతో.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో రూ.10 నుంచి రూ.30 అయ్యింది. 
 
హైదరాబాద్‌లో రూ.20కి పెంచారు. కాచిగూడలో మాత్రం రూ.10 ఉంది. మౌలాలి, మల్కాజిగిరి, లింగంపల్లి రైల్వేస్టేషన్లలోనూ రూ.10గానే ఉంది. నగరంలోని మూడు రైల్వేస్టేషన్లలో కరోనాకు ముందు రోజూ దాదాపు 25 వేల ప్లాట్‌ఫాం టిక్కెట్లు అమ్ముడయ్యేవి. పెరిగిన ధరలతో రైల్వేకు రోజుకు రూ.7.10 లక్షల వరకూ ఆదాయం సమకూరే అవకాశం ఉంది!
 
సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ రైల్వేస్టేషన్లలో సోమవారం నుంచి ప్లాట్‌ఫాం టిక్కెట్ల విక్రయం ప్రారంభించారు. ముందస్తు సూచన లేకుండానే సోమవారం నుంచి పెంచిన ధరలను అమల్లోకి తీసుకొచ్చారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషనులో కౌంటర్‌ బోర్డుపై రూ.10 అని రాసిన పాత ధరల పట్టిక అలాగే ఉంది. 
 
కింద కౌంటర్‌ కిటికీ దగ్గర కాగితంపై రూ.30 అని రాసి.. అమ్మకాలు ప్రారంభించారు. ఈ విషయాన్ని గుర్తించి కొందరు వాదులాటకు దిగారు.  ఉన్నతాధికారులు స్పందిస్తూ.. కరోనా నేపథ్యంలో రద్దీని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనాతగ్గిన తర్వాత ధరలు తగ్గుతాయా? అంటే వారి దగ్గర సమాధానం లేకపోయింది.