1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (20:37 IST)

ఏపీలో పెరిగిపోతున్న కేసులు... కొత్తగా మరో 24... విపక్షాల విసుర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా మరో 24 కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నమోదైన కేసుల వివరాలు 405కు చేరాయి. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. 
 
"రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 9 నుంచి శనివారం సాయంత్రం 5 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరులో 17, కర్నూలులో 5, ప్రకాశం, కడప జిల్లాలలో ఒక్కొక్క కేసు నమోదైంది. కొత్తగా నమోదైన 24 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 405 కి పెరిగింది" అని వైద్య ఆరోగ్య శాఖ నిర్వహణలోని ఆరోగ్యాంధ్ర ట్విట్టర్ ఖాతా వెల్లడించింది.
 
మరోవైపు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఒకవైపు కరోనా విజృంభిస్తుంటే.. దాన్ని కట్టడి చేయాల్సిన ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యంగా, ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతుంటే, సీఎం జగన్ గారు మాత్రం రాష్ట్ర ఎన్నికల అధికారిని అడ్డంగా తొలగించే పనుల్లో నిమగ్నమైపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.