1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 ఆగస్టు 2021 (10:13 IST)

ఏపీలో కొత్త మార్గదర్శకాలు : పెళ్లికి అతిథులు 150కి మించరాదు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై వివాహాలు, ఇతర శుభకార్యాలతోపాటు మతపరమైన సమావేశాల్లో పాల్గొనేవారి సంఖ్య 150కి మించరాదని ప్రభుత్వం పేర్కొంది. వేదికలు, ఇతర చోట్ల సీట్లు పక్కపక్కనే ఉంటే మధ్యలో ఒకదానిని విడిచిపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 
సీట్లు కనుక ముందుగా అమర్చకుండా ఉంటే ఒక సీటుకు మరో సీటుకు మధ్య ఐదడుగుల దూరాన్ని పాటించాలని సూచించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీచేశారు.
 
రాష్ట్రంలో గత 24 గంటల్లో 54,455 నమూనాలు పరీక్షించగా 1,413 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 458 కొత్త కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 207, చిత్తూరు జిల్లాలో 201 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 9 పాజిటివ్ కేసులు గుర్తించారు.
 
అదేసమయంలో 1,795 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మరణాలు సంభవించాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,83,721 పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,50,623 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,549 మందికి చికిత్స కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13,549కి పెరిగింది.