శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (11:04 IST)

కరోనా బాధితుల్లో కొత్త సమస్య... గడ్డకట్టడం లేదా చిక్కపడుతున్న రక్తం

కరోనా వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఈ వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవితాన్ని గడపలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ బారినపడినవారు ఆ వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ.. ఇతర అనారోగ్య సమస్యలు వారిని వేధిస్తున్నాయి. తాజాగా కరోనా సోకిన వారిలో రక్తం గడ్డకట్టడం లేదా చిక్కపడుతున్న కేసులను వైద్యులు గుర్తిస్తున్నారు. 
 
అసలు ఇలా ఎందుకు జరుగుతుందన్న అంశంపై వైద్యులు పరిశోధనలు చేపట్టి, ఓ విషయాన్ని కనుగొన్నారు. ఒక ప్రత్యేకరకమైన అణువు కారణంగా రక్తం గడ్డకడుతుందని గుర్తించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఈ అణువు స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల రక్తం గడ్డకట్టే పరిస్థితి వస్తుందని అంటున్నారు. దీనివల్ల రోగి మరణించే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఐర్లాండ్ యూనివర్శిటీ ఆఫ్ మెడిసిన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ పరిశోధకులు ఏ విషయంపై పరిశోధన నిర్వహించారు. కరోనా రోగులలో రక్తం గడ్డకట్టడం ఎందుకు అని అర్థం చేసుకోవడానికి, డబ్లిన్‌లోని బ్యూమాంట్ ఆసుపత్రిలో చేరిన కరోనా బాధితులపై ఈ పరిశోధనలు జరిగాయి. 
 
వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేయగా, విడబ్ల్యుఎఫ్ అణువు అధిక స్థాయిలో ఉందని రక్త నివేదికలు వెల్లడించాయి. ఈ అణువు రక్తం గడ్డ కట్టడాన్ని ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా వీరిలో రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించే ADAMTS13 అణువు స్థాయి తక్కువగా ఉంది. ఈ రెండు అణువుల సమతుల్యత క్షీణించినప్పుడు, గడ్డకట్టడం మొదలవుతుందని తేల్చారు.