1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2020 (21:11 IST)

తెలంగాణాలో పెరుగుతున్న కేసులు - ముంబైలో 24 గంటల్లో ఎన్ని కేసులంటే?

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గతవారం రోజులుగా ప్రతి రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్క రోజే 52 కేసులు నమోదు కాగా, తాజాగా గత 24 గంటల్లో మరో 37 కేసులు వెలుగుచూశాయి. 
 
తాజా కేసులతో కలిపి రాష్ట్రంలోని మొత్తం బాధితుల సంఖ్య 681కి పెరిగినట్టు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం బాధితుల్లో 118 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 18 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. ఆసుపత్రుల్లో ఇంకా 545 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. 
 
అలాగే, కరోనా వైరస్ మహమ్మారి ముంబైని భయపెడుతోంది. అత్యధిక మంది బాధితులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, అందులో సగం కేసులు రాజధాని ముంబైలోనే నమోదవుతుండటం అధికారులను కలవరపాటుకు గురిచేస్తోంది. 
 
తాజాగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 183 కేసులు నమోదయ్యాయి. అలాగే, నగరానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ముంబైలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1936కు పెరిగినట్టు బీఎంసీ తెలిపింది. ఇప్పటివరకు నగరంలో 113 మంది ప్రాణాలు కోల్పోగా, 181 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు అధికారులు తెలిపారు.