1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎంజీ
Last Modified: శనివారం, 11 సెప్టెంబరు 2021 (23:02 IST)

Corona: దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు, మరణాలు ఎన్నంటే..

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అయితే రెండు రోజులుగా కొత్త కేసులు మళ్లీ తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.92లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 33,376 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అటు కొవిడ్‌ విజృంభణ ఎక్కువగా ఉన్న కేరళలోనూ కేసులు కాస్త తగ్గాయి. నిన్న ఆ రాష్ట్రంలో 25వేల కొత్త కేసులు వెలుగుచూశాయి.
 
తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.32కోట్లు దాటింది. ఇక మరోసారి కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. నిన్న 32,198 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.23కోట్ల మంది కొవిడ్‌ను జయించగా.. రికవరీ రేటు 97.49శాతంగా ఉంది. ప్రస్తుతం 3,91,516 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.18శాతంగా ఉంది.
 
మరోవైపు మరణాల సంఖ్య మరోసారి 300 దాటింది. 24 గంటల వ్యవధిలో 308 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. ఒక్క కేరళలోనే ఈ సంఖ్య 177గా ఉంది. కరోనా దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 4,42,317 మందిని మహమ్మారి పొట్టనబెట్టుకుంది.
 
అటు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న మరో 65.27లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 73.05కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.