శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 మే 2020 (11:44 IST)

కరోనా వైరస్ విజృంభణ.. తమిళనాడులో ఒక్కరోజేలోనే 552 కేసులు

తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, తమిళనాడు రెండో స్థానంలో ఉంది. తమిళనాడులో మంగళవారం ఒక్కరోజే 688 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కేవలం చెన్నైలోనే 552 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,448కి చేరింది. తమిళనాడు వ్యాప్తంగా కరోనాతో 85 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో 37,136 కేసులు నమోదు కాగా, 1,325 మంది మృతి చెందారు. 
 
తమిళనాడులో కరోనా తీవ్రత ఉన్నప్పటికీ.. గ్రామాల్లో సెలూన్ల షాపులు తెరిచేందుకు అనుమతించారు. ఆటో విడి భాగాల తయారీ పరిశ్రమలకు కూడా అనుమతిచ్చారు. కాంచీపురంలో యమహ మోటార్‌ కంపెనీని త్వరలోనే తెరుస్తామని ఆ పరిశ్రమ యజమానులు తెలిపారు. మే 15వ తేదీ నుంచే మద్యం షాపులను తమిళనాడులో తెరిచారు.
 
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం కొత్తగా 68 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2407కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,159 మంది సాంపిల్స్‌ పరీక్షించగా 68 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణయింది.
 
ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1592కు చేరుకుంది. కొత్తగా నిర్ధారణ అయిన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 26 కేసులు ఉండగా.. మేడ్చల్ జిల్లాలో 3 నమోదయ్యాయి. మరో 12 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడ్డ వలస కార్మికుల సంఖ్య 69కి పెరిగింది.