శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మార్చి 2020 (21:16 IST)

#చికెన్ కరోనా దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ విలవిల... రూ.40కే కేజీ

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం వణికిపోతోంది. ఈ వైరస్ ఏకంగా 113 దేశాలకు వ్యాపించింది. అలాగే, లక్షా 15 వేల మందికి ఈ వైరస్ సోకింది. ఈ వైరస్ బారినపడి కోలుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4072గా ఉంది. ఇది మంగళవారానికి అందిన లెక్క. అయితే, ఈ కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలను కుదేలు చేస్తోంది. ఇలాంటి వాటిలో పౌల్ట్రీ రంగం కూడా ఒకటి. 
 
ఈ పరిశ్రమ భారత్‌లో మరింతగా దెబ్బతింది. చికెన్ ఆరగిస్తే కరోనా వైరస్ సోకుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో చికెన్ కొనేవారే కరువయ్యారు. ఫలితంగా చికెన్ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ప్రస్తుతం కేజీ చికెన్ ధర రూ.30 నుంచి రూ.40 పలుకుతుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 
 
ఇటీవల చికెన్ తింటే కరోనా వస్తుందంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. అది నిజం కాదని స్వయంగా ప్రభుత్వాలే అధికారికంగా ప్రకటనలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ.. ప్రజల్లో ఉన్న భయాన్ని మాత్రం ఈ ప్రకటనలు పోగొట్టలేకపోయాయి. ఫలితంగా చికెన్ విక్రయాలు దారుణంగా పడిపోయాయి.
 
దీంతో నష్టాల్లో కూరుకుపోతున్న వ్యాపారులు ధరలను దారుణంగా తగ్గించి విక్రయిస్తున్నారు. అయినా, విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని వాపోతున్నారు. తాజాగా, కర్నూలు జిల్లాలో కిలో చికెన్ ధర గతంలో ఎన్నడూ లేనంతగా ఏకంగా రూ.40కు పడిపోయింది. జిల్లాలోని గూడూరు పంచాయతీ పరిధిలోని ఓ వ్యాపారి ఈ మేరకు దుకాణం ముందు బోర్డులు పెట్టి మరీ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు.