శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మార్చి 2020 (17:17 IST)

మహిళా ట్వంటీ20 వరల్డ్ కప్ : ఫైనల్ మ్యాచ్ వీక్షించిన ప్రేక్షకుడికి కరోనా

ఇటీవల ఐసీసీ మహిళా ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీ జరిగింది. ఇందులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఏమాత్రం పోరాటం చేయకుండానే చేతులెత్తేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా మహిళా జట్టు విశ్వవిజేతగా నిలిచింది. అయితే, ఈ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియంలోకి వచ్చిన ప్రేక్షకుల్లో ఒకరికి కరోనా వైరస్ సోకినట్టు మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం అధికారులు తాజాగా ప్రకటించారు. ఇది మ్యాచ్‌కు వచ్చిన ప్రేక్షకులతో పాటు.. ఆస్ట్రేలియా అధికారులను భయపెడుతోంది. 
 
ఎంసీజీ స్టేడియం నార్త్ స్టాండ్‌లోని ఎన్42 సెక్షన్‌లో ఆ వ్యక్తి కూర్చున్నారని, ఆ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు వెల్లడించారు. అయితే, మ్యాచ్‌ రోజు ఆ వ్యక్తి చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రేక్షకులు, మైదానం సిబ్బంది భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆ వ్యక్తి నుంచి వాళ్లకు కరోనా సోకే అవకాశం చాలా తక్కువగా ఉందన్నారు. కాబట్టి వాళ్లంతా సాధారణంగా ఉండొచ్చని, కాకపోతే శుభ్రత పాటించాలని సూచించారు. దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేశారు.