1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. Coronavirus scare: Mindspace IT Park in Hyderabad not closed partially

'మైండ్ స్పేస్' ఖాళీ అయిందా?.. జయేశ్ రంజన్ ఏమన్నారు?

Coronavirus Scare
తెలుగు రాష్ట్రాల ప్రజలను కరోనా వైరస్ తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీంతో ప్రజలంతా హడలిపోతున్నారు. అదేసమయంలో ఇప్పటివరకు ఈ వైరస్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ విదేశాలకు వెళ్లివచ్చిన వారికే సోకింది. దీంతో టెక్కీలంతా బెంబేలెత్తిపోతున్నారు. ఈ వైరస్‌ మరింతగా వ్యాప్తి చెందకుండా ఐటీ కంపెనీల యాజమాన్యాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇందులోభాగంగా వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని కూడా కల్పించాయి. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని డీఎస్ఎం ఐటీ కంపెనీలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. దీంతో హైటెక్ సిటీ ప్రాంతంలోని రహేజా మైండ్ స్పేస్ మొత్తం ఖాళీ అయిందన్న వార్తలు హల్చల్ చేశాయి. ఈ వార్తలపై తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ స్పందించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, మైండ్ స్పేస్‌లోని బిల్డింగ్ నెంబర్ 20లోని తొమ్మిదో ఫ్లోర్‌లో డీఎస్ఎం కంపెనీ ఉందని, అక్కడి ఉద్యోగులను మాత్రమే బుధవారం ఇంటికి పంపారని చెప్పారు. అంతే తప్ప ‘మైండ్ స్పేస్’లో ఉన్న అన్ని బిల్డింగ్‌లు ఖాళీ అయిపోతున్నాయంటూ అసత్య ప్రచారం జరిగిందని చెప్పారు. రేపటి నుంచి ‘మైండ్ స్పేస్’లోని అన్ని కార్యాలయాలు యథాతథంగా నడుస్తాయని స్పష్టం చేశారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి ఇకలేరు...