1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మార్చి 2020 (11:53 IST)

కరోనా ఎఫెక్ట్.. హైదరాబాదులో మాస్కులు రెక్కలొచ్చేశాయి..నిలువుదోపిడీ

హైదరాబాదుకు కరోనా కేసు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ నుంచి తప్పించుకునేందుకు మాస్కులు ధరించాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా మాస్కులకు రెక్కలొచ్చాయి. కరోనా వైరస్‌ను అదునుగా భావిస్తున్న మందుల దుకాణదారులు వాటి ధరలను అమాంతం పెంచేసి విక్రయిస్తున్నారు.
 
హోల్‌సేల్‌లో రూ.1.60 విలువ చేసే రెండు లేయర్ల మాస్కును ఇప్పుడు రూ.20-25 వరకు డిమాండ్‌ను బట్టి విక్రయిస్తుండగా, రూ.30-40 విలువ చేసే ఎన్95 మాస్క్‌ను రూ.300 వరకు విక్రయిస్తున్నారు. మాస్కులకు ఎటువంటి కొరత లేదని ప్రభుత్వం పదేపదే చెబుతున్నా వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. 
 
నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల వద్ద వీటికి మరింత డిమాండ్ ఉంది. అలాగే జనరల్ స్టోర్స్‌లోనూ మాస్కుల ధర అమాంతం పెరిగిపోయింది. గతంలో వంద మాస్కుల ప్యాకెట్ రూ.160 ఉంటే, ఇప్పుడది ఏకంగా రూ.1600కు పెరగడం గమనార్హం.
 
మరోవైపు బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తూ అక్కడే ఉంటున్న హైదరాబాద్ యువకుడి ఫ్లాట్‌కు అక్కడి అధికారులు సీలు వేశారు. అంతకుముందు ఇంటిని పూర్తిగా శుభ్రం చేశారు. అతడికి కరోనా సోకినట్టు వార్తలు రావడంతో బెంగళూరు ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్యాధికారులను అతడి ఫ్లాట్‌కు పంపి శుభ్రం చేయించి సీలు వేయించింది.
 
మరోవైపు అతడు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. వారితో పాటు అతడితో కలసి పనిచేసిన వారు నగరంలోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛెస్ట్ డిసీజెస్‌లోని ఐసోలేషన్ వార్డులో చేరారు. వీరి నుంచి నమూనాలు సేకరించిన వైద్యులు పరీక్షల కోసం పూణెకు పంపారు.

కాగా, బాధితుడి ఫ్లాట్‌లో అతడితో కలిసి ఉన్న మరో యువకుడికి కరోనా పరీక్షల్లో నెగటివ్ అని రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాధితుడు కలిసినట్టు భావిస్తున్న మొత్తం 71 మందిని గుర్తించిన అధికారులు వారికి పరీక్షలు నిర్వహించారు.