కాస్త శాంతించిన కరోనా .. 2.59 లక్షల కేసులు నమోదు  
                                       
                  
				  				  
				   
                  				  కరోనా వైరస్ దెబ్బకు దేశ ప్రజలు చివురుటాకులా వణికిపోతున్నారు. ఈ వైరస్ ఓ ప్రళయంగా విరుచుకుపడుతుంది. దీంతో ప్రతి రోజూ రెండు లక్షలకు పై చిలుకు కేసులు నమోదవుతున్నాయి. అదేసమయంలో మరణాల సంఖ్య కూడా భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఆంక్షలు విధిస్తున్నారు. 
				  											
																													
									  
	 
	ఈ క్రమంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15,19,486 కొవిడ్ పరీక్షలు జరపగా.. 2,59,170 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,53,21,089కి చేరింది. అయితే అంతక్రితం రోజు(2.73లక్షలు)తో పోలిస్తే కొత్త కేసులు కాస్త తగ్గినప్పటికీ మరణాలు మాత్రం అంతకంతకూ పెరుగుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది. 
				  
	 
	ఇక 24 గంటల వ్యవధిలో మరో 1761 మంది వైరస్ వల్ల మృత్యువాతపడ్డారు. దీంతో కరోనా దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 1,80,530 మంది వైరస్కు బలవ్వగా.. మరణాల రేటు 1.18శాతానికి చేరింది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య 20లక్షలు దాటింది. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20,31,977 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 13.26శాతానికి పెరిగింది. తాజాగా మరో 1,54,761 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు మొత్తం 1,31,08,582 మంది వైరస్ను జయించారు. 
				  																		
											
									  
	 
	ఇక మహారాష్ట్ర, దిల్లీ, యూపీ తదితర రాష్ట్రాల్లో కొవిడ్ తీవ్రత కొనసాగుతోంది. మహారాష్ట్రలో నిన్న 58,924 పాజిటివ్ కేసులు వెలుగు చూడగా.. 351 మరణాలు చోటుచేసుకున్నాయి. దిల్లీలో 23,686కేసులు, 240 మరణాలు నమోదయ్యాయి. యూపీలో 28,211 కేసులు, 167 మరణాలు సంభవించాయి.