1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (10:44 IST)

భార్య కాపురానికి రాలేదనీ టెక్కీ భర్త ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలోని గజ్వేల్ పట్టణంలో ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ బలవన్మరణానికి పాల్పడింది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం గమనార్హం. ఈ  ఘటన సోమవారం గజ్వేల్‌ పట్టణంలో చోటుచేసుకుంది. 
 
గజ్వేల్‌ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. గజ్వేల్ పట్టణానికి చెందిన పోతిరెడ్డి జీవన్‌రెడ్డి (30)కి గత ఏడాది డిసెంబరులో మహబూబ్‌నగర్‌ చెందిన కొమ్మారెడ్డి ప్రవళిక అనే యువతితో వివాహమైంది. లాక్డౌన్‌ నేపథ్యంలో అతను గజ్వేల్‌లో ఉంటూ ఇంటి వద్ద నుంచే కంపెనీ పనులు చేస్తున్నాడు. పెళ్లి అయిన వారం రోజులకే ప్రవళిక పుట్టింటికి వెళ్లిపోగా ఎన్నిసార్లు రమ్మని చెప్పినా ఆమె రావడం లేదు. 
 
తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని అందుకే తాను మీ ఇంటికి రానని చెప్పడంతో మనస్తాపం చెందాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జీవన్‌రెడ్డి తన గదిలోకి వెళ్లి గడియ వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకుముందు తన చరవాణిలో భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో ఉరి వేసుకుంటున్నానని వీడియో రికార్డు చేసి తల్లి సుందరి, ఇతర బంధువులకు పంపించాడు. 
 
ఈ వీడియోను చూసిన తల్లి వెంటనే బంధువుల సాయంతో తలుపును పగులగొట్టి గదిలోకి వెళ్లగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించిన జీవన్‌రెడ్డిని కిందకు దింపి గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తల్లి సుందరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.