1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (11:23 IST)

20K మార్క్‌ను దాటిన కరోనా కేసులు - గుజరాత్‌లో ఒక్కసారిగా పెరిగిన కేసులు

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. అదుపులో ఉన్నట్టే కనిపించి ఈ వైరస్ గత వారం రోజులుగా విజృంభిస్తోంది. ఫలితంగా అనేక మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. ఫలితంగా గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1383 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులతో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 19,984కు చేరగా, ఇప్పటివరకు మొత్తం 640 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.  
 
ఇకపోతే, దేశంలో కరోనా వైరస్ బారినపడి మొత్తం 3869 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 15,474 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసుల సంఖ్య 5,218కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 251 మంది మృతి చెందారు. గుజరాత్‌లో 2,178 మందికి కరోనా సోకగా, ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 2,156కి చేరింది.
 
గుజరాత్‌లో ఒక్కసారిగా విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి. తమిళనాడు, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో 1,500పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినప్పటికీ కేసులు 20,000కు చేరువలో ఉన్నాయి.