1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 మే 2021 (18:38 IST)

మారిన టీకా నిబంధనలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు స్వస్తి

దేశంలో కరోనా వైరస్ బారినపడుకుండా ఉండేందుకు వీలుగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే కోరుతున్నాయి. అదేసమయంలో ఈ వ్యాక్సిన్ల కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న నిబంధన విధించింది. అయితే, ఇపుడు ఈ నిబంధనను ఎత్తివేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో 18-44 వయస్సు గల ప్రజలకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది. 
 
ఈ వయస్సు వారికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఉండవు. కొత్త నిబంధన ప్రకారం, ఈ వయసు గ్రూపు వ్యక్తులు టీకా కేంద్రాలలో నమోదు చేసుకొని అపాయింట్‌మెంట్ పొందగలుగుతారు. ఈ సదుపాయాన్ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ టీకా కేంద్రాల్లో అందించనున్నారు. 
 
కేంద్రం ఈ నోటిఫికేషన్లను అన్ని రాష్ట్రాలకు పంపించి, రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ఆన్-సైట్లో ప్రారంభించాలని కోరింది. ఈ సదుపాయాన్ని వారు స్వయంగా ప్రారంభిస్తారా లేదా అనేది రాష్ట్రాలదే తుది నిర్ణయం అని కూడా ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
 
వాస్తవానికి అనేక విభాగాల ప్రజలు రాష్ట్రాల నుంచి టీకా కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. వారిలో చాలా మంది టీకా సెంటర్‌కు చేరడం లేదు. దీంతో ఆ సమయంలో ఇచ్చిన టీకా స్లాట్ వల్ల వ్యాక్సిన్ వృధా అయిపోతుంది. 
 
దాంతో టీకా వ్యర్థాల కేసులు పెరుగుతున్నాయి. ఈ నివేదికల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదికాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
అంతకుముందు శనివారం, కేంద్ర ప్రభుత్వం టీకాపై ఒక అడుగు ముందుకు వేసింది. ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యాక్సిన్ ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోని ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలకు కూడా టీకాలు వేయగలుగుతారు. దీనివల్ల ఎక్కువ మందికి టీకాలు వేయడానికి, కంపెనీలు తయారీదారుల నుండి నేరుగా ఆసుపత్రుల ద్వారా వ్యాక్సిన్లను కొనుగోలు చేసుకునే అవకాశం లభిస్తుంది.