బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2020 (13:21 IST)

దేశంలో పెరుగుతున్న కేసులు - రికవరీ రేటు .. తగ్గుతున్న మరణాలు...

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. అదేసమయంలో ఈ వైరస్ బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మరో శుభవార్త ఏంటంటే.. ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. ఇది పెద్ద ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. 
 
దేశంలో గత 24 గంటల్లో 86,432 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 40,23,179కి పెరిగింది.
 
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న భారత్‌లో కేసుల జోరు ఇలాగే కొనసాగితే బ్రెజిల్‌ను వెనక్కి నెట్టేసి రెండో స్థానానికి ఎగబాకడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బ్రెజిల్‌లో 40,91,801 కేసులు నమోదయ్యాయి. 
 
భారత్‌లో ఆ సంఖ్య 40,23,179గా ఉంది. అంటే రెండు దేశాల మధ్య తేడా 68,622 మాత్రమే. కాగా, శుక్రవారం కరోనా కారణంగా 1,089 మంది మృతి చెందారు. ఫలితంగా దేశంలో ఇప్పటి వరకు 69,561 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
మొత్తం బాధితుల్లో 8,46,395 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా, 31,07,223 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 77.23 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.73 శాతానికి తగ్గడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. దేశవ్యాప్తంగా ఇంకా 8,46,395 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా నిన్న 10,59,346 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.
 
ఇదిలావుండగా, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో ఏకంగా 2,511 కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,38,395కు పెరిగింది. 
 
శుక్రవారం ఒక్క రోజే 11 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య 877కు చేరుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 305 కేసులు వెలుగుచూశాయి. ఇక, కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా భారీగా ఉండడం ఊరటనిచ్చే విషయం.
 
శుక్రవారం ఒక్క రోజే 2,579 మంది కోలుకున్నారు. వీరితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,04,603 మంది కరోనా కబంధ హస్తాల నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ఇంకా 32,915 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. 
 
శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 62,132 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 16,67,653కు పెరిగింది. రాష్ట్రంలో 25,729 మంది హోం, సంస్థాగత ఐసోలేషన్‌లో ఉన్నారు.