1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 మార్చి 2022 (10:36 IST)

దేశంలో మరింతగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింతగా తగ్గింది. ఫలితంగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,539 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ వైరస్ నుంచి 4,491 మంది కోలుకున్నారు. అయితే, 60 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 30,799 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.35 శాతంగా ఉంది. అయితే రికవరీ రేటు మాత్రం 98.73 శాతానికి పెరిగింది. 
 
కరోనా కోరల్లో సౌత్ కొరియా 
కరోనా వైరస్ మళ్లీ వణికిస్తుంది. ఇప్పటికే కరోనా పుట్టినిల్లు అయిన చైనాలోని అనేక ప్రాంతాల్లో ఈ వైరస్ దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. వైరస్ వ్యాప్తి కట్టడి కోసం సంపూర్ణ, పాక్షిక లాక్డౌన్‌లను అమలు చేస్తున్నారు. మరోవైపు, సౌత్ కొరియాను కరోనా వైరస్ చెరబట్టినట్టు తెలుస్తుంది. ఒకే రోజు ఏకంగా నాలుగు లక్షలకు పైచిలుకు కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ దేశంలో కలకలం చెలరేగింది. 
 
కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇంతటి భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం గమనార్హం. గత 24 గంటల్లో 4,00,741 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 293 మంది మృత్యువాతపడినట్టు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 76 లక్షలకు చేరుకుంది. 
 
భారత్‌కు పొంచివున్న ముప్పు 
పొరుగు దేశమైన చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి పతాకస్థాయికి చేరేలా కనిపిస్తుంది. రోజువారీగా నమోదయ్యే స్టెల్త్ ఒమిక్రాన్ వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా చైనాలోని పలు నగరాల్లో సంపూర్ణ లాక్డౌన్, పాక్షిక లాక్డౌన్‌ను అమలు చేస్తున్నారు. 
 
మరోవైపు, చైనాలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో భారత్‌కు కూడా ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దఫా కరోనా వైరస్ ఏకంగా 75 శాతం మందికి సోకవచ్చని కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ గ్రూపునకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ ఎన్కే అరోరా కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
కరోన్ థర్డ్ వేవ్ రావడానికి ప్రధాన కారణం బీఏ.2 వేరియంట్ అని, ఇప్పటికీ దాని ఆనవాళ్లు ఉంకా కనిపిస్తున్నాయని, అందువల్ల నాలుగో దశ కరోనా వైరస్ వ్యాప్తి తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే జూలై నెలలో నాలుగో వేవ్ ప్రారంభంకావొచ్చని ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.