శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (11:11 IST)

నొప్పి లేకుండానే కరోనా నిర్ధారణ పరీక్ష... ఎలా?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారించేందుకు వివిధ రకాలైన పరీక్షలను నిర్వహిస్తున్నారు. పలు రకాలైన పద్దతులు అందుబాటులో ఉన్నప్పటికీ... వాటిలో చాలా మేరకు ఖర్చుతో కూడుకున్నవి. పైగా, పలు టెస్టులు నొప్పి, బాధను కూడా కలిగిస్తాయి. 
 
ఈ నేపథ్యంలో బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజీ లండన్‌ (యూసీఎల్‌) శాస్త్రవేత్తలు కరోనా టెస్ట్ కోసం కొత్త ఆవిష్కారం చేశారు. అదే స్మార్ట్ ఫోన్ స్వాబ్‌తో కరోనా నిర్ధారణ. ఒక వ్యక్తిలో వైరస్‌ జాడను పసిగట్టేందుకూ స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగపడతాయని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. 
 
మొబైల్‌ ఫోన్‌ స్క్రీన్ల నుంచి సేకరించిన నమూనాల సాయంతో కొవిడ్‌ను వేగంగా గుర్తించే చౌకైన ఒక విధానాన్ని వారు అభివృద్ధి చేశారు. శరీరంలోకి ఎలాంటి సాధనాన్ని పంపాల్సిన అవసరం లేకుండానే ఈ పరీక్షను నిర్వహించొచ్చు. అంతేకాదు ఖచ్చితమైన ఫలితాన్ని పొందొచ్చు. 
 
ఈ విధానానికి ‘ఫోన్‌ స్క్రీన్‌ టెస్టింగ్‌’ (పోస్ట్‌) అని పేరు పెట్టారు. ఇందులో కొవిడ్‌ అనుమానితుల నుంచి నమూనాలను నేరుగా సేకరించడానికి బదులు వారి మొబైల్‌ స్క్రీన్ల నుంచి స్వాబ్‌లు సేకరించి, పరీక్షించారు. ముక్కు, గొంతు నుంచి సేకరించిన స్వాబ్‌లకు నిర్వహించిన పీసీఆర్‌ పరీక్షలో ‘కొవిడ్‌ పాజిటివ్‌’గా తేలినవారు ఈ కొత్త విధానంలోనూ పాజిటివ్‌గా తేలారు. 
 
ఈ విధానం ఆధారంగా.. ఫోన్ల నుంచి నమూనాలను సురక్షితంగా సేకరించి, వాటిని విశ్లేషించి, మేసేజ్ ద్వారా రిజల్ట్‌ను ఆ వ్యక్తికి నేరుగా చేరవేసేందుకు చిలీకి చెందిన స్టార్టప్ ‘డయాగ్నోసిస్‌ బయోటెక్‌’ ఒక యంత్రాన్ని రూపొందిస్తోంది.