శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జులై 2020 (09:50 IST)

ఆన్‌లైన్ క్లాసులు.. 40శాతం విద్యార్థులకు నో స్మార్ట్ ఫోన్..

ఆన్‌లైన్ తరగతులు కలిసిరావట్లేదు. కరోనా నేపథ్యంలో ప్రైవేట్‌ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ క్లాసులు విద్యార్థులకు అర్థం కావడం లేదని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. ఆన్‌లైన్‌ విద్యాబోధనపై యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(యూటీఎఫ్‌) ఇటీవల చేపట్టిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఆఫ్‌లైన్‌ బోధనే పాఠశాల విద్యకు లైఫ్‌లైన్‌ అని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పకనే చెప్పారు. 
 
68.7 శాతం మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు అర్థం కాకపోగా, 27.7 శాతం విద్యార్థులకు కొంత మేరకే అరర్థమవుతున్నాయి. అలాగే ఆన్ లైన్ తరగతుల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 40శాతం మంది విద్యార్థులకు స్మార్ట్ ఫోనుల్లేవని వాపోతున్నారు. స్మార్ట్ ఫోన్లు లేకుండా ఆన్ లైన్ తరగతులకు ఎలా అటెండ్ అవుతామోనని మండిపడుతున్నారు.  
 
మరోవైపు కరోనావైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రైవేటు స్కూల్స్ ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడమే కాకుండా ఫీజులు కూడా వసూలు చేస్తుండటంపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనావైరస్ కారణంగా ఓవైపు వేల మంది జీవితాలనే కోల్పోతుంటే... ఇప్పుడిప్పుడే అంత హడావిడాగా ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని హైకోర్టు ప్రైవేటు పాఠశాలలను ప్రశ్నించింది. 
 
కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహించకపోతే మిన్ను విరిగి మీద పడుతుందా అంటూ హై కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆన్‌లైన్ క్లాసెస్ పేరిట స్కూల్ ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూల్స్ ఆగడాలను అడ్డుకోవాల్సిందిగా కోరుతూ దాఖలైన ఆ పిల్‌ శుక్రవారం విచారణకు వచ్చిన సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.