1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
  4. PPE kits to doctors by vijayawada chemist and druggist association

వైద్యులకు పిపిఇ కిట్లు సమకూర్చిన కెమిస్టు, డ్రగ్గిస్టు అసోసియేషన్

PPE kits
కరోనా నివారణ చర్యలలో భాగంగా ముందువరుసలో నిలబడి సేవలు అందిస్తున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బందికి ఉపయోగపడేలా రిటైల్ కెమిస్టు, డ్రగ్గిస్టు అసోసియేషన్ - విజయవాడ, కృష్ణాజిల్లా కెమిస్టు డ్రగ్గిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో వంద వ్యక్తిగత సంరక్షణ సామాగ్రితో కూడిన (పిపిఇ) మెడికల్ కిట్లను సమకూర్చటం ముదావహమని జిల్లా పాలనాధికారి ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. 
 
గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా ఔషద నియంత్రణ విభాగపు సహాయ సంచాలకులు కొలనుకొండ రాజభాను చేతుల మీదుగా జిల్లా పాలనా అధికారి ఇంతియాజ్ అహ్మద్ వీటిని అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనాపై పోరుకు ఎందరో మహానుభావులు తమవంతు సహకారం అందిస్తున్నారని, ఈ క్రమంలో కెమిస్టు, డ్రగ్గిస్టు అసోసియేషన్లు సైతం లక్ష రూపాయల విలువైన పిపిఇ కిట్లు వితరణగా అందించటం శుభపరిణామమన్నారు.
 
జిల్లా ఔషధ నియంత్రణ అధికారి కొలనుకొండ రాజభాను తమ సేవా కార్యక్రమానికి ప్రేరణగా నిలిచారని ఈ సందర్భంగా రిటైల్ కెమిస్టు, డ్రగ్గిస్టు అసోసియేషన్ - విజయవాడ శాఖ అధ్యక్షులు డివిఆర్ సాయికుమార్ తెలిపారు. ఔషధ నియంత్రణ శాఖ సూచనలతో తమ అసోసియేషన్ విభిన్న సేవా కార్యక్రమాలు చేపడుతూ వచ్చిందని, ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాలలో తమ ప్రతినిధులు శానిటైజర్లు, మాస్క్‌లు స్థానిక యంత్రాంగానికి అందించారన్నారు. 
 
జిల్లా ఔషధ నియంత్రణ అధికారి కొలనుకొండ రాజభాను మాట్లాడుతూ ఔషధ విక్రయదారులు సదీర్ఘ కాలంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల మన్ననలను అందుకుంటున్నారన్నారు. ఇప్పటికే గుడివాడ, అవనిగడ్డ, మొవ్వ, తిరువూరు, జగ్గయ్యపేట, మచిలీపట్నంలలో అసోసియేషన్ ప్రతినిధులు కరోనా నివారణ చర్యలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములు అయ్యారని రాజభాను జిల్లా కలెక్టర్‌కు వివరించారు.
 
ఈ కార్యక్రమంలో రిటైల్ కెమిస్టు, డ్రగ్గిస్టు అసోసియేషన్ - విజయవాడ కార్యదర్శి సుధాకర్, కోశాధికారి దామోదర రావు, ఉపాధ్యక్షులు సోమేశ్వరరావు, కృష్ణా జిల్లా సంఘం అధ్యక్షులు సాధుప్రసాద్, కోశాధికారి శ్రీహరి తదితరులతో పాటు ఔషధ నియంత్రణ శాఖ అధికారులు శ్రీరామమూర్తి, వినోద్, అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
దూసుకెళ్ళిన ఖాళీ గూడ్సు రైలు - వలస కూలీల మృతి.. ఎక్కడ?